సొంత అడ్డాలో జనసేన టార్గెట్ ? రెండ్రోజుల్లో రెండు ఘటనలు..!
ఏపీలో గత ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్ తో పోటీ చేసిన 21 సీట్లలో 21 గెల్చుకున్న జనసేన పార్టీ ఇప్పుడు సొంత అడ్డాలోనే ఆత్మరక్షణలో పడుతోంది. గత రెండు రోజుల్లో చోటు చేసుకున్న రెండు ఘటనలతో జనసేన టార్గెట్ అయినట్లు కనిపిస్తోంది. అయితే జనసేనను టార్గెట్ చేస్తోంది ఎవరన్న దానిపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. మంత్రి కారును అడ్డుకున్న ఘటనలో జనసేన కార్యకర్తలు అరెస్టు కాగా.. మరో ఘటనలో ఏకంగా జనసేన ఎమ్మెల్యే కారుపైనే దాడి జరిగింది.
రెండు రోజుల క్రితం రామచంద్రపురం టీడీపీ ఎమ్మెల్యే, రాష్ట్రమంత్రి వాసంశెట్టి సుభాష్ కారును కొందరు అడ్డుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కె. గంగవరం మండలం మసకపల్లిలో వరద ప్రాంతాల్ని పరిశీలించి వస్తున్న సుభాష్ కారును జనసేన కాార్యకర్తలుగా భావిస్తున్న కొందరు అడ్డుకున్నారు. మద్యం మత్తులో వీరంతా మంత్రి కారును అడ్డుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇంతవరకూ బాగానే ఉన్నా వీరిని అర్ధనగ్నంగా పోలీసు స్టేషన్లో నిలబెట్టిన వైనం చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు నిన్న రాత్రి పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై కొందరు దాడి చేశారు. చీకట్లో రాళ్లు రువ్వడంతో ఎమ్మెల్యే బాలరాజు కారు స్వల్పంగా ధ్వంసమైంది. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి బర్రింకలపాడు జంక్షన్ వద్ద జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. అయితే ఎమ్మెల్యే కారులో లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఆకతాయి ఘటనగా పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. అయితే ఎమ్మెల్యే కారుపై రాళ్లు విసరాల్సిన అవసరం ఎవరికి ఉంటుందన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ఏదేమైనా రెండు రోజుల్లో ఇలా జనసేన క్యాడర్, ఎమ్మెల్యే టార్గెట్ కావడంపై గోదావరి జిల్లాల్లో చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications