జనతా కర్ఫ్యూ ఐడియా వెనుక ఏపీ క్యాడర్ ఐఎఎస్ అధికారి: ప.గో జిల్లా కలెక్టర్గా..కొల్లేటి ఆపద్బాంధవుడిగా
అమరావతి: ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది ఉసురు తీస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్పై భారత్ ఓ యుద్ధమే చేస్తోంది. ఈ పోరాటంలో భాగంగా కోట్లాదిమంది భారతీయులు స్వచ్ఛందంగా గృహ నిర్బంధంలో ఉంటున్నారు. ఒకరి నుంచి మరొకరికి సోకకుండా ఈ వైరస్ను నియంత్రంచడంలో భాగంగా తమను తాము నిర్బంధించుకుంటున్నారు. హౌస్ అరెస్ట్లో కొసాగుతున్నారు. దీనికోసం జనతా కర్ఫ్యూ అనే కాన్సెప్ట్ను తెరమీదికి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం.
లండన్ బాబు.. అక్కడ ఎంఎస్ చేస్తూ ఇంటికి: కొత్తగూడెం డీఎస్పీ కుమారుడికి పాజిటివ్
జనతా కర్ఫ్యూ గ్రాండ్ సక్సెస్
కరోనా వైరస్ను నియంత్రించే ప్రక్రియలో భాగంగా అమలు చేస్తోన్న ఈ జనతా కర్ఫ్యూ ఏ రేంజ్లో సక్సెస్ అయిందో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపునకు దేశం మొత్తం ఐక్యంగా స్పందించింది. ఏకతాటిపై నిలిచింది. జనతా కర్ఫ్యూను విజయవంతం చేసింది. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఏ ఒక్కరు రోడ్ల మీదికి రాలేదంటే.. జనతా కర్ఫ్యూ ఏ స్థాయిలో ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవచ్చు.
ఈ ఐడియా వెనుక ఏపీ క్యాడర్ ఐఎఎస్ అధికారి..
ఈ ఐడియా వెనుక ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన ఐఎఎస్ అధికారి ఉన్నారని అంటున్నారు. ఆయనే- లవ్ అగర్వాల్. 1996 బ్యాచ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐఎఎస్ అధికారి. రాష్ట్ర విభజన తరువాత ఏపీ కిందికే వచ్చారు. ప్రస్తుతం కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖలో కీలక పాత్ర పోషిస్తున్నారు. చాలాకాలం కిందటే కేంద్ర సర్వీసులకు వెళ్లిన లవ్ అగర్వాల్ ప్రస్తుతం వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
కరోనాను కట్టడి చేయడంలో..
ప్రాణాంతక కరోనా వైరస్ భారత్లో విస్తరిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. దాన్ని నియంత్రించడంలో వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) కీలకంగా మారాయి. ఆ శాఖ అధికారులు ఇస్తోన్న ఆలోచనలను మరింత మధించి కార్యాచరణలోకి తీసుకొస్తోంది కేంద్ర ప్రభుత్వం. కరనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకడాన్ని నియంత్రించగలిగితే.. దాని వ్యాప్తిని అడ్డుకోవచ్చని, దీనికోసం దేశ ప్రజలందరూ సహకరించాల్సి ఉంటుందని, ఏకతాటిపై నడవాల్సి ఉంటుందనే ఆలోచనను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమల్లోకి తీసుకొచ్చారు.
రాష్ట్ర ప్రజలకు సుపరిచితుడే..
లవ్ అగర్వాల్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితుడే. ఇదివరకు ఆయన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా పనిచేశారు. 2005 నుంచి 2007 మధ్యకాలంలో ఆయన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా పనిచేశారు. ఆ సమయంలో కృష్ణా జిల్లా కలెక్టర్తో కలిసి కొల్లేటి సరస్సులో ఆక్రమణలను తొలగించడంలో కీలక పాత్ర పోషించారు. రాజకీయంగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినప్పటికీ లెక్క చేయలేదు. ఆక్రమణల బారి నుంచి కొల్లేటి సరస్సును విముక్తి చేశారు. ఆ రకంగా లవ్ అగర్వాల్.. రెండు తెలుగు రాష్ట్రాలకు చిరపరిచితుడయ్యారు. అనంతరం పలు శాఖల్లో పనిచేశారు. చాలాకాలం కిందటే కేంద్ర సర్వీసులకు వెళ్లిన ఆయన ప్రస్తుతం వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ కార్యదర్శిగా ఉన్నారు.