వైసీపీలో ఎవరినైనా వాడుకుని వదిలేస్తారు: అనర్హత వేటుపై స్పందించిన జంగా కృష్ణమూర్తి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల తర్వాత ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీ ఎన్నికల ముందు పార్టీలు మారిన నేతలపై చర్యలకు దిగుతున్నట్టు తాజా పరిణామాలతో అర్ధం అవుతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీనియర్ రాజకీయ నాయకుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కి బిగ్ షాక్ తగిలిన విషయం తెలిసిందే. పార్టీ ఫిరాయింపు కారణంగా ఆయనపై చైర్మన్ మోషేను రాజు అనర్హత వేటు వేశారు.
జంగా కృష్ణమూర్తిపై వైసీపీ ఫిర్యాదు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన జంగా కృష్ణమూర్తి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. గురజాల టికెట్ కాసు మహేశ్ రెడ్డికి కేటాయించటంతో ఆవేదనకు గురైన ఆయన వైసీపీ విధానాలు నచ్చక టీడీపీలో చేరినట్టు అప్పుడు పేర్కొన్నారు. దీంతో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలని వైసిపి శాసనమండలి చైర్మన్ కు ఫిర్యాదు చేసింది.

అనర్హుడిగా ప్రకటించిన శాసనమండలి చైర్మన్
శాసనమండలి చైర్మన్ జంగా కృష్ణమూర్తిని ఎమ్మెల్సీగా అనర్హుడిగా ప్రకటించి, శాసన మండలి సభ్యత్వాన్ని రద్దు చేస్తూ బుధవారం అర్ధరాత్రి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనిపై జంగా కృష్ణమూర్తి స్పందించారు. తనపై అనర్హత వేటు వేయడం కేవలం వైసీపీ కక్షపూరిత చర్య అని జంగా కృష్ణమూర్తి ఆరోపించారు. మౌఖికంగా తన వివరణ కోరకుండానే అనర్హత వేటు వేశారని మండిపడ్డారు.
ఇది వెనుకబడిన వర్గాలపై తీసుకున్న చర్య
దీనిని వెనుకబడిన వర్గాలపై తీసుకున్న చర్యగా భావిస్తున్నామని ఆయన తెలిపారు. ఒక బీసీ నాయకుడిపై తీసుకున్న ఈ చర్య బీసీలందరికీ వర్తిస్తుందని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ పదవి తనకు వ్యక్తిగతంగా ఇచ్చిన పదవి కాదని పేర్కొన్న ఆయన అది బీసీ వర్గాలకు ఇచ్చిన పదవని అభిప్రాయం వ్యక్తం చేశారు.
వల్లభనేని వంశీ, మద్దాలి గిరిపైన రెండేళ్లపాటు ఎందుకు చర్యలు తీసుకోలేదు?
శాసనమండలి చైర్మన్ పైన ఒత్తిడి తీసుకువచ్చి తనపై వేటు వేయించారని ఆయన పేర్కొన్నారు. వల్లభనేని వంశీ, మద్దాలి గిరి పైన రెండేళ్లపాటు ఎందుకు చర్యలు తీసుకోలేదు? చెప్పాలని జంగా కృష్ణమూర్తి ప్రశ్నించారు. బీసీలను అణగదొక్కే ప్రయత్నం వైసిపి చేస్తుందని, వైసీపీలో ఎవరినైనా వాడుకుని వదిలేస్తారని జంగా కృష్ణమూర్తి ఆరోపించారు.












Click it and Unblock the Notifications