వివాదంగా పాలారు చెక్డ్యామ్: చంద్రబాబు వైఖరిపై జయలలిత నిరసన
చెన్నై/విజయవాడ: ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన ఏపీ పరిధిలోని చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోగల కంగుంది పంచాయతీ వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణ చోటుచేసుకుంది. పాలారు నదిపై చెక్డ్యామ్ల ఎత్తు తగ్గించాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఇటీవల లేఖ రాసిన సంగతి తెలిసిందే.
కాగా, చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలో ఈ చెక్డ్యాం ఎత్తును ఐదు అడుగుల నుంచి 12 అడుగులకు పెంచడాన్ని తమిళనాడు సీఎం నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర పీఎంకె పార్టీ మాజీ ఎమ్మెల్యేలు పొన్నుస్వామి, రాజా, మహేంద్ర, పళణి, నటరాజన్ శనివారం ఆంధ్ర రాష్ట్రంలోని కంగుంది పంచాయతీకి చెందిన పెద్దవంక గ్రామం వద్ద వున్న కనకనాశమ్మ ఆలయం వద్ద చెక్డ్యాంను పరిశీలించారు.
అంతేగాక, కాసేపు అక్కడ ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వేలూరు బిజెపి జిల్లా అధ్యక్షుడు వెంకటేష్, తిరుపత్తూరు పీఎంకె పార్టీ ఎమ్మెల్యే నల్లతంబి ఏపీ సరిహద్దుల్లో 15ఏళ్ల క్రితం నిర్మించిన చెక్డ్యాం మరమ్మతు పనులను పరిశీలించి వెనుతిరిగారు.
ఆ తర్వాత వేలూరు జిల్లా రెవెన్యూ అధికారి మణివన్నన్ చెక్డ్యాం ప్రదేశాన్ని పరిశీలించి ఇది తమ పరిధిలో లేదని వెనుతిరిగి వెళ్లిపోయారు. అయితే బుధవారం కనకనాశమ్మ ఆలయ పరిసరాల్లో జాతర సందర్భంగా ఏర్పాటు చేయనున్న అంగళ్ల వేలం పాటలు నిర్వహించారు. అయితే ప్రతి సంవత్సరం ఈ ప్రాంతంలో తమిళనాడు వాసులు వేలం పాట నిర్వహిస్తూ ఆలయానికి వచ్చే ఆదాయాన్ని తీసుకెళ్లిపోయేవారు.
ఈ సంవత్సరం మాత్రం ఆంధ్రరాష్ట్ర అధికారులు ఆలయం వద్ద జాతర జరపడమే కాకుండా వేలం పాటలన్నీ నిర్వహిస్తున్నట్లు ప్రకటించి.. ఈ ప్రాంతంలో చెక్డ్యాంను మరమ్మతులు చేస్తున్న విషయాన్ని తెరపైకి తెచ్చారు తమిళనాడు వాసులు. దీంతో పెద్దవంక నుంచి తమిళనాడు రాష్ట్రం వైపువెళ్లే రహదారిపై చెట్లు, ముళ్లకంపలు అడ్డంగా వేసి అటువైపు ఎవరూ రాకుండా తమిళిలు అడ్డుకున్నారు.
ఈ విషయం తెలిసిన వేలూరు డీఎస్పీ హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకొని విద్యార్థులను, ప్రయాణికులను అడ్డగించడం సబబుకాదని హెచ్చరించారు. దీంతో తమిళనాడు రాష్ట్రం ఆదారకుప్పంకు చెందిన పళణి, అతని తమ్ముడు శ్రీనివాసులు వెనుతిరగడంతో సమస్య సద్దుమణిగింది.
అయితే ఈ సమస్య రానురాను పెద్దదయ్యే అవకాశం ఉందని స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇరు రాష్ట్రాల పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. అయితే, తమిళనాడు సీఎం జయలలిత లేఖను ఏపీ సీఎం చంద్రబాబునాయడు పరిగణలోకి తీసుకుంటారో లేదో వేచిచూడాలి.