నిన్న కెసిఆర్తో... నేడు చంద్రబాబుతో జయప్రద: ఆనంపై శైలజానాథ్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కలిసేందుకు మాజీ ఎంపీ, ప్రముఖ సినీ నటి జయప్రద వచ్చారు. చంద్రబాబును కలిసేందుకు ఆమె రావడం చర్చనీయాంశమైంది.
సోమవారం నాడు జయప్రద... విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. చంద్రబాబును కలిసేందుకు జయప్రద రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
అంతకుముందు, శనివారం నాడు జయప్రద హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిశారు. ఆమె తన తనయుడు వివాహానికి కెసిఆర్ను ఆహ్వానించారు. చంద్రబాబును కూడా తన తనయుడి పెళ్లికి ఆహ్వానించేందుకు వచ్చారని తెలుస్తోంది.
రాజకీయాల్లేవు: జయప్రద
చంద్రబాబును కలిసిన అనంతరం జయప్రద విలేకరులతో మాట్లాడారు. తన కుమారుడి వివాహానికి ఆహ్వానించేందుకే తాను ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశానని చెప్పారు. ఆయనకు ఆహ్వాన పత్రికను అందించానన్నారు. రాజకీయాలు మాట్లాడలేదన్నారు.
ఆనం వ్యవహారాన్ని పరిశీలిస్తున్నాం: శైలజానాథ్
మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ మారతారని వస్తున్న ఊహాగానాల పైన ఆ పార్టీ సీనియర్ నేత శైలజానాథ్ స్పందించారు. ఆనం పార్టీ మారుతున్నట్లు వచ్చిన వ్యాఖ్యలను పత్రికల్లో చూశామని, ఆనం సోదరుల వ్యాఖ్యలను పార్టీ పరిశీలిస్తుందన్నారు.
ఆనం సోదరులు పార్టీ వీడతారని తాము అనుకోవడం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ చేసేది ప్రజా చైతన్య యాత్రలు కాదని, ఫెయిల్యూర్ యాత్రలు విమర్శించారు. తాము అడిగిన 50 ప్రశ్నలకు టిడిపి సమాధానం చెప్పాలన్నారు. మేనిఫెస్టోలో చెప్పిందొకటి, చేసేది ఒకటి అని మండిపడ్డారు.