తెలంగాణలో జయప్రద ప్రచారం, బాబువల్లేనని ఆగ్రహం
నల్గొండ: రాష్ట్రీయ లోకదళ్ (ఆర్ఎల్డీ) నాయకురాలు, ప్రముఖ సినీ నటి జయప్రద తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రీయ లోకదళ్ తరఫున జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఆర్ఎల్డీయే తెలంగాణలో టిఆర్ఎల్డీగా ఉంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ తరఫున జయప్రద ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో టిఆర్ఎల్డీ కూడా ప్రముఖ పాత్ర పోషించింది.
ఈ నేపథ్యంలో అదే అస్త్రంతో ఆమె ప్రచారం చేస్తున్నారు. తెలుగుదేశం, కాంగ్రెసు, భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితిలకు పలువురు స్టార్ కంపెయినర్లు ఉన్నారు. కానీ, టిఆర్ఎల్డీకి రాష్ట్రంలో స్టార్ కంపెయినర్లు లేరు. అయితే, జయప్రద తెలుగు నటి అయినందున ఆమె ఇప్పుడు స్టార్ కంపెయినర్ అని చెప్పుకోవచ్చు.
జయప్రద శనివారం నల్గొండ జిల్లాలో ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో సంపదను దోచుకున్న కాంగ్రెసు పార్టీ, అధికారమే పరమావధిగా సాగుతున్న తెలంగాణ రాష్ట్ర సమితిలను చిత్తుగా ఓడించాలని ఆమె అన్నారు. తెలంగాణ ఏర్పాటులో ఆర్ఎల్డీ పాత్ర మొదటి నుండి చివరి వరకు క్రియాశీలకంగా ఉందన్నారు.
రైతుల సంక్షేమం, మహిళల రక్షణ విషయంలో ఆర్ఎల్డీ అండగా ఉంటుందన్నారు. సామాజిక తెలంగాణ తమ పార్టీతోనే సాధ్యమని చెప్పారు. భువనగిరి ఎంపీగా కపిలవాయి దిలీప్ కుమార్, ఆలేరు ఎమ్మల్యే అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్లను గెలిపించాలని ఆమె కోరారు. సామాజిక తెలంగాణ తమ పార్టీతోనే సాధ్యమన్నారు. పరిస్థితులు అనుకూలించకే తాను రాష్ట్రం నుండి పోటీ చేయలేదన్నారు.
అనంతరం జయప్రద వరంగల్ జిల్లాలో ప్రచారం నిర్వహించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ... టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు. తాను గతంలో ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేయకపోవడానికి కారణం చంద్రబాబేనన్నారు. భవిష్యత్తులో తెలంగాణ, సీమాంధ్రలో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేస్తానన్నారు.