ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్ చేసేందుకే బీజేపీ: తెలుగు ప్రజలకు క్షమాపణ చెప్పిన జయప్రద
తూర్పుగోదావరి: ఏపీ సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు బీజేపీ నేత, మాజీ ఎంపీ జయప్రద. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల ప్రదేశ్గా మార్చేస్తున్నారన్నారు. రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన బీజేపీ గోదావరి గర్జనసభకు హాజరైన జయప్రద ప్రసంగించారు. కేంద్రం నిధులతోనే ఏపీలో అభివృద్ధి జరుగుతోందన్నారు.
ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చడానికే జేపీ నడ్డా ఇక్కడికి వచ్చారని జయప్రద తెలిపారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి వెళ్లాయి కానీ, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఎవరూ పనిచేయలేదన్నారు. ఏపీ సర్కారు రూ. 7 లక్షల కోట్లు అప్పు చేసిందని.. అయితే పేదలకు మాత్రం ఒరిగిందేమీ లేదన్నారు. బడుగు బలహీన వర్గాలు అట్టడుగు స్థాయికి వెళ్తున్నాయన్నారు. యువతకు సరైన ఉపాధి అవకాశాలు కల్పించలేదన్నారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయన్నారు.

ఇక రాష్ట్రంలో రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారిందని జయప్రద వ్యాఖ్యానించారు. బీజేపీని పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తాను కొన్ని పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రాన్ని వదిలి వెళ్లాల్సి వచ్చిందన్నారు. ఇందుకు తెలుగు ప్రజలకు ఆమె క్షమాపణలు చెప్పారు. కాగా, ఇటీవల తాను తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నట్లు జయప్రద తెలిపిన విషయం తెలిసిందే. పార్టీ ఆదేశిస్తే తాను ఏపీ లేదా తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తానని చెప్పారు.
బీజేపీ పోరాటం కొనసాగుతుంది: సోము వీర్రాజు
వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ పోరాటం చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ముఖ్యమంత్రి జగన్ పాలన దిగజారిపోయిందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పన లేదని సోము వీర్రాజు ఆరోపించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు, ఉద్యోగాలు లేక యువత తీవ్ర ఇబ్బందులు పడుతోందని ధ్వజమెత్తారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, మంత్రులు.. విచ్చలవిడిగా భూములు, వనరుల దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. కోనసీమ అల్లర్ల వైఖరిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు.
గోదావరి బీజేపీ గర్జనలో బీజేపీ నేతలు జీవీఎల్ నరసింహారావు, పురంధేశ్వరి, సుజనా చౌదరి, సీఎం రమేష్, మాధవ్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications