ఫ్లెక్సీ చించివేత, గో బ్యాక్: జెపికి అడ్డంకి, టూర్ వాయిదా
అనంతపురం/కర్నూలు: తెలుగు తేజం పేరుతో యాత్ర ప్రారంభించిన లోక్సత్తా పార్టీ అధ్యక్షుడు, కూకట్పల్లి శాసన సభ్యుడు తన యాత్రను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. ఆయన యాత్రను సమైక్యవాదులు అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతానికి జెపి యాత్రను వాయిదా వేశారు. పోలీసుల సమక్షంలో యాత్ర జరపడం తనకు ఇష్టం లేదన్నారు. తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలను ఆంధ్ర ప్రదేశ్ను విభజించినట్లు విభజిస్తారా అని ప్రశ్నించారు.
రాష్ట్రంపై కాంగ్రెసు పైశాచిక ధోరణి అవలంభిస్తోందన్నారు. రాష్ట్ర నేతలు తెలుగు జాతిని ఢిల్లీలో తాకట్టు పెట్టారన్నారు. దేశంలో మిగతా రాష్ట్రాలని కాంగ్రెసు పార్టీ అధిష్టానం విడగొట్టే ప్రయత్నాలు చేయగల్గుతుందా అని ప్రశ్నించారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగలేదన్నారు. జెపి యాత్ర ఈ రోజు అనంతపురంలో కొనసాగించారు.
ఈ సమయంలో ఆయనకు అడుగడుగునా అడ్డంకులు ఎదురయ్యాయి. పలువురు సమైక్యవాదులు ఆయనను అడ్డుకున్నారు. జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా స్పష్టమైన నిర్ణయం చెప్పాకనే యాత్ర చేయాలని డిమాండ్ చేశారు. అనంత హౌసింగ్ బోర్డులో లోక్సత్తా సదస్సులో సమైక్యవాదులు జెపి గో బ్యాక్ అంటూ నినదించారు. అక్కడున్న ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. దీంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు.
జెపి మాట్లాడుతుండగా ఆయన మైక్ను సమైక్య జెఏసి కట్ చేసింది. రేపు జెపి మడకశిరలో పర్యటిస్తారని తెలిసి అక్కడ సమైక్యవాదులు బందుకు పిలుపునిచ్చారు. తన యాత్రకు అడ్డంకులు ఎదురు అవుతుండటంతో జెపి తన యాత్రను తాత్కాలికంగా ఆపేశారు.