రాష్ట్ర విభజన: కేంద్రంపై జెపి ధ్వజం, సిఎంపై అక్బర్
తాంబూలాలు ఇచ్చాం.. తన్నుకు చావండి అన్నట్లు కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉందని జెపి ఆరోపించారు. అసమగ్రమైన బిల్లును శాసనసభకు ఎందుకు పంపించారని ప్రశ్నించారు. రాష్ట్రపతి నుంచి వచ్చిన దానిలో బిల్లు అనే ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
సీమాంధ్ర సమస్యలపై ఎందుకు మాట్లాడటం లేదు: సిఎంపై అక్బర్
రాష్ట్ర విభజనతో తెలంగాణలోనే ఎక్కువ సమస్యలు వస్తాయంటున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో వచ్చే సమస్యలపై ఎందుకు మాట్లాడటం లేదని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ధ్వజమెత్తారు. విభజన వల్ల తెలంగాణ ప్రాంతంలో విద్యుత్, లిఫ్ట్ ఇరిగేషన్ సమస్యలు వస్తాయని, ఉద్యోగాల అంశంలో కూడా సమస్యలు ఏర్పడుతాయని సిఎం కిరణ్ అనడంపై అక్బరుద్దీన్ మండిపడ్డారు.
శాసనసభలో అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు చేయాలని కొందరు, విభజనను వ్యతిరేకిస్తూ మరికొందరు సభ్యులు తమ అభిప్రయాలను వెల్లడిస్తున్నారని అన్నారు. సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నానంటున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సీమాంధ్ర ప్రాంతంలోని సమస్యలను ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ఆ అంశమే ప్రస్తుతం ఎంతో ముఖ్యమని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడంలో సీమాంధ్ర నేతలు విఫలమయ్యారని అన్నారు.
తెలంగాణ కావాలని ఆ ప్రాంత నేతలు స్పష్టంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. తాము కూడా తమ వైఖరికి కట్టుబడి ఉన్నట్లు అక్బరుద్దీన్ ప్రకటించారు. ప్రస్తుతం సభ్యులు బిల్లు అసమగ్రంగా ఉందని అంటున్నారని, మేం కూడా అదే చెప్పామని తెలిపారు. బిల్లుపై నాయకుల్లో ఏకాభిప్రాయం తీసుకురావడం కాదని, ప్రజల్లో తీసుకురావాలని కోరారు. బిల్లుపై న్యాయ సలహా కోసం అడ్వకేట్ జనరల్ లేదా న్యాయ నిపుణులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలన్నారు.
శాసనసభ సోమవారానికి వాయిదా
తెలంగాణ ముసాయిదా బిల్లుపై సభ్యులందరూ తమ అభిప్రాయాలను తెలపాలని స్పీకర్ నాదెండ్ల మనోహర్ కోరారు. బిల్లుపై చర్చించేందుకు అందరు సభ్యులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుతోపాటు మరికొందరు సభ్యులు ఇచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలిపారు. సభ్యులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా తెలపొచ్చని అన్నారు. అదే సమయంలో వ్యక్తుల పేర్లను ప్రస్తావిస్తూ విమర్శలు చేయవద్దని అన్నారు. శాసనసభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.