మోడీ నటిస్తే కనుక, కేవలం మంత్రమే: పవన్ కళ్యాణ్ హోదా డిమాండ్కు జేపీ షాక్
అమరావతి: ఏపీకి ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలను ఆయన మరిచిపోయినట్లుగా నటించినా ప్రజలు మాత్రం గుర్తుంచుకుంటారని లోక్సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ చురకలు అంటించారు. ఆయన ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
ఏపీకి కేంద్రం నుంచి వచ్చిన నిధుల లెక్క చెబితే తప్పేమిటని ఆయన అభిప్రాయపడ్డారు. తాము వివిధ మార్గాల ద్వారా కొన్ని వివరాలు సేకరించామని చెప్పారు. కేంద్రం ఇటీవల బడ్జెట్లో ప్రకటించిన హెల్త్ స్కీం, రైతులకు డబుల్ ఆదాయంపై జేపీ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రభుత్వం రాద్దాంతం చేయవద్దు
ఏపీకి వచ్చిన నిధుల విషయంలో ఇప్పటికే తమకు కొంత సమాచారం వచ్చిందని, ఇంకా ఏమైనా రానిది ఉంటే వారు ఇవ్వవచ్చునని, ప్రభుత్వాలు దానిని రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ఉండవల్లి అరుణ్ కుమార్, తనకు ఇప్పుడు జేఎఫ్సీతో ఉద్యోగం దొరికిందన్న విమర్శలపై స్పందించేందుకు నిరాకరించారు. నేను పదవులు కోరుకోవడం లేదని, తాను చెప్పేది ఆచరించాలని చెబుతున్నానని అన్నారు.
లెక్కలు అక్కడ కుదరదు
ఒక పార్టీలోని రెండు వర్గాలే దుమ్మెత్తి పోసుకుంటాయని, అలాంటప్పుడు ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం ఆయా పార్టీలు విమర్శలు చేసుకోవడం మామూలేనని బీజేపీ, టీడీపీ మాటల యుద్ధాన్ని ఉద్దేశించి జేపీ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అవసరమా లేదా అనే మాట తాను మాట్లాడనని, కానీ ఆర్థికంగా ఆదుకోవాలని జేపీ అభిప్రాయపడ్డారు. పన్ను రాయితీలు, గ్రాంట్లు అన్నింటిని ఇవ్వాలన్నారు. స్టూడియోల్లో లెక్కలు చెబుతామంటే కుదరదన్నారు.
హోదా కేవలం మంత్రమే
ప్రత్యేక హోదా అనేది కేవలం మంత్రమేనని, దాని గురించి అందరికీ పూర్తిగా తెలియదని జేపీ అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా గురించి పోరాడుతున్న పవన్తో గతంలో ప్రత్యేక హోదా వద్దన్న మీరు ఎలా కలుస్తున్నారని ప్రశ్నించగా.. హోదా అనేది కేవలం మంత్రమే అన్నారు. హోదాతో ఏ ప్రయోజనాలు వస్తాయనేది ముఖ్యమన్నారు. అంతిమంగా ఏపీని ఆర్థికంగా ఆదుకోవడం ముఖ్యమన్నారు.
మోడీ మరిచిపోయినా
అసలు రాష్ట్రాలకు కేంద్రం సాయం చేయడం ఏమిటని జేపీ ప్రశ్నించారు. సాధించుకోవడం రాష్ట్రాల హక్కు అన్నారు. అది ఎవరూ ఊరికేనే ఇచ్చేది కాదన్నారు. ప్రధాని మోడీ తాను ఏపీకి ఇచ్చిన హామీని మర్చిపోయినట్లు నటిస్తే ప్రజలు గమనిస్తారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కనీసం పది శాతం ఓట్లు వస్తేనే ఎన్నికల్లో లోక్సత్తా పోటీ చేస్తుందని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం, ఏపీకి న్యాయం కోసం రాజీనామాలు చేస్తామని ఏ పార్టీ చేసినా అది రాజకీయ ప్రయోజనాల కోసమే అని జేపీ అన్నారు.