పట్టించుకోవట్లేదు, అందుకే నేను ఇలా: పవన్ కళ్యాణ్పై జేపీ విమర్శలు
అమరావతి/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తొలుత తెరపైకి తెచ్చింది తానేనని లోక్సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ శుక్రవారం చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే అవకాశమే లేదని, ఈ విషయం అందరికీ తెలుసునని ఆయన అన్నారు.
Recommended Video
నేనొస్తున్నా!: రంగంలోకి రామ్ మాధవ్, బాబుకు చెక్ పెట్టేనా? నేరుగా అధికారంలోకి రాకున్నా...
ఏపీకి ప్రత్యేక రాదని అన్ని రాజకీయ పార్టీలకు తెలుసునని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పేరు ఏదైనా కావొచ్చు కానీ రాష్ట్రానికి రావాల్సిన నిధులు మాత్రం రావాలన్నారు. ప్రత్యేక హోదా అనే పేరు లేకపోయినప్పటికీ నిధులు వచ్చి, ఏపీ అభివృద్ధి చెందాలని అభిప్రాయపడ్డారు.
కేంద్రం ఏం చేసిందో తెలుసుకునేందుకు
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చట్టపరంగా, పార్లమెంటులో ఇచ్చిన హామీలను కేంద్రం ఏ మేరకు హామీలు నెరవేర్చిందో తేల్చడం కోసం జయప్రకాశ్ నారాయణ ఆధ్వర్యంలో స్వతంత్ర నిపుణుల బృందం ఏర్పాటయింది. ఇది తొలి సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా జేపీ మాట్లాడారు.
పవన్ కళ్యాణ్ మొదట చూపిన శ్రద్ధ తర్వాత కనిపించలేదు
ఈ సమయంలో ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన విమర్శలు గుప్పించారు. జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ (జేఎఫ్సీ) పైన పవన్ మొదట చూపిన శ్రద్ధ ఆ తర్వాత కనిపించడం లేదని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు పట్టించుకోవడం లేదన్నారు. నిధులపై హడావుడి చేసి ఇప్పుడు సైలెంట్ అయ్యారన్నారు. జేఎఫ్సీపై శ్రద్ధ పెట్టడం లేదన్నారు. నిధుల వ్యవహారం నిగ్గు తేలుస్తామన్నారు.
స్వతంత్ర నిపుణుల కమిటీ ఏర్పాటు చేశా
జాయింట్ ఫ్యాక్ఠ్ ఫైండింగ్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత దానిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పవన్ను ఉద్దేశించి జేపీ అన్నారు. అందుకే తాను స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేశానని చెప్పారు. జేఎఫ్సీ తొలిదశ అయితే స్వతంత్ర నిపుణుల కమిటీ రెండో దశ అన్నారు. తాము చర్చించడానికి కేంద్రం సమయం ఇస్తే వెళ్లి కలుస్తామని చెప్పారు.
పవన్ కళ్యాణ్ నేతృత్వంలో
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఏపీకి కేంద్రం ఇచ్చిన నిధుల లెక్క తేల్చేందుకు జేఎఫ్సీ ఏర్పాటయిన విషయం తెలిసిందే. ఈ కమిటీ వారం పాటు అన్ని లెక్కలు తీసి మీడియా ముందు ఉంచింది. అయితే ఆ తర్వాత పవన్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు.