టీడీపీని నాశనం చేస్తున్నారు, మీవాడ్ని కాదా? బాబుపై గౌరవంతోనే: జయరాములు సంచలనం
కడప: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ చేరిన బద్వేలు ఎమ్మెల్యే జయరాములు ఆదివారం తన ఆవేదను వెలిబుచ్చారు. తాను తెలుగుదేశం పార్టీలో లేనా? ఆ పార్టీ ఎమ్మెల్యేను కాదా? అంటూ జయరాములు వాపోయారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే తాను టీడీపీలో చేరానని, స్వార్థంతో రాలేదని చెప్పుకొచ్చారు.
బద్వేలు ఆర్ అండ్ బీ బంగ్లాలో ఆదివారం జయరాములు మీడియాతో మాట్లాడారు. బద్వేలు నియోజకవర్గం పేరుకే ఎస్సీ రిజర్వుడు... పెత్తనమంతా ఒక వర్గం వారిదేనని ఆయన ఆరోపించారు.
మాజీకి మద్దతిస్తూ..
నియోజకవర్గంలోని ప్రజలను అభివృద్ధి చెందకుండా అడ్డుకునేది ఆ వర్గం వారేనని జయరాములు అన్నారు. దళిత ఎమ్మెల్యేనైన తన ఆత్మగౌరవం దెబ్బతినేలా మాజీ ఎమ్మెల్యే ప్రవర్తించడం బాధాకరమని జయరాములు అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మంత్రులంతా కూడా ఆమెకు మద్దతు ఇవ్వడంలో ఆంతర్యమేమిటని ఎమ్మెల్యే ప్రశ్నించారు.
టీడీపీ ఎమ్మెల్యేను కాదా?
దళితులపై ఎందుకు ఇంత చిన్నచూపు?, వారిని మనుషులుగా గుర్తించాలి కదా అని జయరాములు ఆవేదన వ్యక్తం చేశారు. బద్వేలు నియోజకవర్గంలో 7 సబ్స్టేషన్లు మంజూరు చేయించామని, అయితే తనకు తెలియకుండా సబ్స్టేషన్లో నియామకాలు జరిగిపోవడం చూస్తే తాను టీడీపీ ఎమ్మెల్యేను కాదా? అని ఆయన ప్రశ్నించారు.
Recommended Video
టీడీపీని నాశనం చేస్తున్నారు..
అంతేగాక, నీరు- చెట్టు పనులన్నీ కూడా మాజీ ఎమ్మెల్యే వర్గీయులే చేస్తున్నారని, తనను నమ్ముకున్న కార్యకర్తలకు ఒక్క పని కూడా మంజూరు చేయలేకపోయానని ఎమ్మెల్యే వాపోయారు. బద్వేలు టీడీపీకి కంచుకోటగా ఉండేదని, అయితే పార్టీని నాశనం చేసింది ఎవరనేది ఈ ప్రాంత ప్రజానీకానికి తెలుసని చెప్పారు.
బాబుపై గౌరవంతోనే..
సీఎం చంద్రబాబు మీద గౌరవంతో పార్టీలోకి వచ్చానని, ఇప్పుడు తనను లక్ష్యంగా చేసుకుని నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని జయరాములు వాపోయారు. బద్వేలు నియోజకవర్గంలో జరుగుతున్న విషయాలపై త్వరలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళనున్నట్లు తెలిపారు.