ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇక అనవసరం: 'మోడీ మెజార్టీపై' జెసి సంచలనం
విజయవాడ: తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు, అనంతపురం సీనియర్ రాజకీయ నాయకుడు జెసి దివాకర్ రెడ్డి విజయవాడలో మరోసారి ఆసక్తికర, సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఇంతమంది ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులు అనవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇంతమంది ప్రజాప్రతినిధిలకు టీఏలు, డిఏలు ఖర్చులు తప్ప మిగిలిందేమీ లేదన్నారు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రులను నేరుగా ఎన్నుకుంటే చాలన్నారు. ఇలాంటప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు అవసరం లేదన్నారు.
కేంద్రంలో మెజార్టీ ఉండటంతో తమకు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానిని నేరుగా ఎన్నుకుంటే చాలన్నారు. ఇక ఎన్నికలు అనవసరమన్నారు. కాగా, కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలో ఉంది.
2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ హవా కారణంగా బిజెపి 272 మార్జిన్ సీట్లను దాటింది. అయినప్పటికి మిత్రధర్మంలో భాగంగా మోడీ ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మిత్రపక్షాలను మంత్రివర్గంలోకి తీసుకున్నారు.
అయితే, కేంద్రంలో బిజెపికి మార్జిన్ మెజారిటీ ఉండటం వల్ల తమకు ప్రాధాన్యత లేకుండా పోయిందని ఆయన జెసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ముప్పై ఏళ్లలో ఏ పార్టీకి మార్జిన్ రాలేదు. పలు పార్టీలు కలిసి ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. దీంతో, చిన్న పార్టీలు కూడా ఆడిందే ఆట అయిన విషయం తెలిసిందే.
కాగా, జేసీ గతంలోను పలుమార్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తాను సంక్షేమ పథకాలకు వ్యతిరేకినని, కూలి పనికి వెళ్లేవారు రోజులో ఐదు సార్లు టీ తాగుతుంటారని, అలాంటి వారికి కిలో రూపాయి బియ్యం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. తనకు లక్ లేకనే మంత్రిని కాలేకపోయానని, చంద్రబాబుకు లక్ ఉండటంతోనే తిరిగి సీఎం అయ్యారన్నారు.