విమానం ఆపలేదని ఊగిపోయిన జేసీ, ఎయిర్ పోర్ట్లో ఫర్నీచర్ ధ్వంసం!
అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, అనంతపురం పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి శుక్రవారం నాడు గన్నవరం విమానాశ్రయంలో హల్చల్ సృష్టించారు. విమానాశ్రయంలో ఫర్నీచర్ ధ్వంసం చేసినట్లుగా కూడా వార్తలు వచ్చాయి.
ఎయిర్ ఇండియా విమానంలో ఆయన న్యూఢిల్లీ వెళ్లవలసి ఉంది. ఆయన వచ్చేసరికి ఆ విమానం వెళ్లిపోయింది. దీంతో ఆయన కోపం కట్టలు తెంచుకుంది. తాను వస్తున్నానని చెప్పినా విమానం నిలపకపోవడంపై ఆయన మండిపడ్డారు.
బోర్డింగ్ ముగిసిపోయిందని అధికారులు చెప్పడంతో ఆయన చిందులు తొక్కారు. సాయంత్రం 4.45 గంటలకు ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీ నుంచి హైదరాబాదు మీదుగా గన్నవరం చేరుకుంది. అందులో ప్రయాణించేందుకు జేసీ 5.30 గంటలకు విమానాశ్రయానికి చేరుకున్నారు.
అప్పటికే విమానం బోర్డింగ్ పూర్తి చేసుకుందని మేనేజరు చెప్పడంతో.. విమానం బయలుదేరలేదు కదా.. అవకాశం కల్పించాలని జేసీ అడిగారు. మీ ప్రయాణం లేదని ప్రోటోకాల్ వారు చెప్పటంతోనే బోర్డింగ్ ముగించినట్లు చెప్పారు.
పైలెట్ ఒక్కసారి డోర్ క్లోజ్ చేసిన తర్వాత తీయటం అసాధ్యమన్నారు. ఎంపీ అయిన నాకే బోర్డింగ్ క్లోజ్ అని చెబుతారా? అంటూ జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కంప్యూటర్ను ధ్వంసం చేయటానికి ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని అక్కడకు చేరుకుని ఎంపీ జేసీని సముదాయించారు.