జగన్! మీ ఊళ్లో లేదా, నాలో ఇంకా కాంగ్రెస్ రక్తం: జెసి సంచలనం, రోజాపై ఫైర్
అనంతపురం: అనంతపురం పార్లమెంటు సభ్యుడు, తెలుగుదేశం పార్టీ నేత జెసి దివాకర్ రెడ్డి సోమవారం నాడు మరోసారి సంచలన, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనలో ఇంకా కాంగ్రెస్ పార్టీ రక్తం ఉందని చెప్పారు. అదే సమయంలో ప్రతిపక్షం వైసిపి పైన మండిపడ్డారు.
విపక్ష నేతలంతా తోపుడు బండ్లపై వ్యాపారం చేసుకునే వారి కడుపు కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్ మనీ అన్ని ప్రాంతాల్లో ఉందని చెప్పారు. కాల్ మనీ పైన విపక్షం అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు. తనలో ఇంకా కాంగ్రెస్ రక్తం ఉందని, అయినప్పటికీ చంద్రబాబు పైన నమ్మకంతో టిడిపిలో చేరానని చెప్పారు.
కాల్ మనీ అంటూ రోజూ గొడవ చేస్తూ, డబ్బులు అవసరమైన వారికి అప్పులు పుట్టకుండా చేస్తున్నారన్నారు. వడ్డీ వ్యాపారం అనేది ప్రతి ఊర్లో ఉందన్నారు. వైసిపి అధినేత జగన్ స్వగ్రామంలో వడ్డీ వ్యాపారం లేదా అని ప్రశ్నించారు. వడ్డీ వ్యాపారం చేయడం తప్పుకాదని, ఎక్కువ వడ్డీ వసూలు చేయడమే తప్పన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడైనా కాల్ మనీ వ్యాపారం చేసుకోమని ఎవరికైనా సూచించారా అని విపక్షంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో గోల చేయడం తప్పితే విపక్షం ఏం చేసిందన్నారు. కాల్ మనీ పైన అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారు. ఇంత గొడవ చేసి జగన్ సాధించిందేమిటని ప్రశ్నించారు.
కామ చంద్రబాబు అంటూ వైసిపి ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యల పైన జెసి మండిపడ్డారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు. రోజా సస్పెన్షన్ స్పీకర్ నిర్ణయమని, దాని గురించి తాను మాట్లాడనని చెప్పారు.
రాజకీయాలు స్వచ్ఛంగా లేవని, అనవసరంగా రాద్ధాంతం చేయడం, గొడవ చేయడం తప్ప మరో పని లేదన్నారు. అసెంబ్లీలో ఆ అరుపులు ఏమిటని, మనుషులమా లేక అడవిలో జంతువులమా అన్నారు. ఎవరు ఏమీ చేయాలనుకన్నా చంద్రబాబును ఏమీ చేయలేరన్నారు.
ప్రభుత్వం తప్పులు చేస్తే ప్రతిపక్షం ఎత్తి చూపాలని, కానీ ప్రతిపక్షమే తప్పు చేస్తే ఎలా అని జెసి అన్నారు.