అప్పటి వరకే కాంగ్రెసులో, జగన్ పార్టీలోకి జంప్: రఘువీరాపై జెసి
అనంతపురం: ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగరానికి వెళ్లినప్పుడల్లా బాధ కలుగుతుందని అనంతపురం జిల్లా తాడిపత్రి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు జెసి ప్రభాకర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లాంటి రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎప్పుడు వస్తుందో తెలియదని, అటువంటి రాజధాని వస్తుందనే నమ్మకం లేదని ఆయన అన్నారు.
గోదావరి పుష్కరాల్లో భాగంగా రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటను రాజకీయం చేస్తున్న కాంగ్రెస్ నేతలపై జెసి ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి భవిష్యత్తుపై జోస్యం చెప్పారు.
గోదావరి పుష్కరాల్లో ప్రమాదవశాత్తు జరిగిన దుర్ఘటనపై విచారం వ్యక్తం చేయాల్సిందిపోయి, విమర్శలు గుప్పిస్తున్నారంటూ రఘువీరాపై జేసీ మండిపడ్డారు. పార్టీ అధ్యక్ష పదవి ఉన్నంతకాలం మాత్రమే రఘువీరారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటారని వ్యాఖ్యానించారు. ఆ పదవి ఊడిన మరుక్షణం రఘువీరా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లడం ఖాయమని జేసీ జోస్యం చెప్పారు.
కాంగ్రెసు పార్టీ వల్ల తాము లాభపడ్డామని ఆయన గురువారం మీడియాతో అన్నారు. రాష్ట్ర విభజన వల్లనే కాంగ్రెసు పార్టీని వీడాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ వృధాగానే పోతున్నాయని ఆయన అన్నారు.
తన సొంత నియోజకవర్గం తాడిపత్రి పట్టణాభివృద్ధికి అవసరమైతే దౌర్జన్యానికి దిగుతానని ఆయన వ్యాఖ్యానించారు. రాయలసీమ వంటి కరుపు ప్రాంతాలకు మంచినీరు, సాగు నీరు ఇస్తేనే చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు.
ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అనంతపురం జిల్లాకు రావాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెసు ప్రభుత్వ హయాంలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు రాహుల్ గాంధీ సాయం చేస్తే మంచిదని ఆయన వ్యాఖ్యానించారు.