ఎపికి ప్రత్యేక హోదా హుళ్లక్కే: మరోసారి కుండబద్దలు కొట్టిన జెసి
అనంతపురం/ కడప: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్రెడ్డి మరోసారి కుండబద్దలు కొట్టారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం డబ్బులిస్తుందని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రధాని నరేంద్ర మోడీ, హోం శాఖ మంత్రి రాజనాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షాలతో మాట్లాడినప్పుడు ప్రత్యేక హోదా రాదన్న విషయం వారి మాటల్లో స్పష్టమయిందన్నారు. అయితే కేంద్ర పాలకులకు రాష్ట్రంపై సానుభూతి ఉందన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీని ఆదుకుకోవాలన్న సంకల్పంతో ఉన్నారని చెప్పారు.
ప్రత్యేక హోదాపై టిడిపి, బిజెపి డ్రామా
కాగా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే, తెచ్చే విషయాల్లో బిజెపి, టిడిపి డ్రామాలు ఆడుతున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ దుయ్యబట్టారు. కడపలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన శుక్రవారంనాడు మాట్లాడారు. ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు సమావేశాల్లో హామీ ఇచ్చారని, ప్రత్యేకంగా నిధులు కూడా ఇస్తామన్నారని ఆయన గుర్తు చేశారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత బిజెపి ప్రత్యేక హోదాపై వెనక్కి వెళ్లిందని ఆయన విమర్శించారు. ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రులు, బిజెపి నేతలు తలో రకంగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ రామకృష్ణ గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో బస్సు యాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.