ఈ ఏడాదే గుడ్బై, ఆ బియ్యం ఎవరూ తినట్లేదు: మళ్లీ జేసీ సంచలన వ్యాఖ్యలు
అనంతపురం: అనంతపురం పార్లమెంటు సభ్యులు, తెలుగుదేశం పార్టీ నేత జేసీ దివాకర్ రెడ్డి మంగళవారం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు మరోసారి కలకలం రేపుతున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి తాను రాజకీయాల నుంచి వైదొలగుతానని చెప్పారు.
తాజాగా, అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లిలో జరిగిన ప్రపంచ నేల దినోత్సవం కార్యక్రమానికి జేసీ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఈ ఏడాదే రాజకీయాల నుంచి వైదొలగుతానని షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఈ ఏడాది రాజకీయాల నుంచి వైదొలగుతా
ఈ ఏడాది రాజకీయాల నుంచి వైదొలగుతానని, ఇక నష్టమైనా లాభమైనా వ్యవసాయం చేసుకుంటానని జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. రైతుల్లో మార్పు రావాలన్నారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీల కోసం ఎదురు చూడకుండా కష్టపడి పని చేయాలన్నారు.

కష్టపడేవారికి ఎక్కడైనా కడుపు నిండుతుంది
కష్టపడేవాడికి ఎక్కడకు వెళ్లినా కడుపు నిండుతుందని జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. ఇన్పుట్ సబ్సిడీ కంటే రైతులకు ఎరువులపై రాయితీ ఇవ్వాలని చెప్పారు. వ్యవసాయంలో ఆధునాతన పరికరాలు, యంత్రాలను రైతులకు అందివ్వాలని అన్నారు.

రూపాయికి కిలో బియ్యం ఎవరూ తినడం లేదు
ప్రజలకు రూపాయికి కిలో బియ్యం ఇస్తూ ప్రభుత్వాలు సోమరిపోతులను తయారు చేస్తున్నాయని జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఇచ్చే రూపాయి బియ్యాన్ని ఎవరూ తినడం లేదని వ్యాఖ్యానించారు.

రాజకీయాల్లో ఇక నుంచి మౌనంగా జేసీ
కాగా, గత కొంతకాలంగా జేసీ దివాకర్ రెడ్డి రాజకీయాలపై ఆసక్తిగా ఉండటం లేదు. తాను వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాల నుంచి వైదొలగుతానని చెప్పారు. ఇప్పుడైతే ఏకంగా ఈ ఏడాదే తప్పుకుంటానని చెప్పారు. దీంతో ఆయన రాజకీయాల్లో స్తబ్ధుగా ఉండే అవకాశాలున్నాయి. వైదొలగుతానంటే రాజీనామా చేసే పరిస్థితులు మాత్రం లేవని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications