చేతులు జోడించి.. సారీ చెప్పిన జేసీ దివాకర్(వీడియో)
అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. గురువారం విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన ఘటన తర్వాత ఆయనపై విమాన సంస్థలు నిషేధం విధించిన విషయం తెలిసిందే.
అమరావతి/విశాఖపట్నం: అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. గురువారం విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన ఘటన తర్వాత ఆయనపై విమాన సంస్థలు నిషేధం విధించిన విషయం తెలిసిందే. కాగా, ఈ సంఘటనపై ఆయన్ను మీడియా ప్రశ్నించింది.
ఎవరైతే ఏంటీ?, అబద్ధం చెప్పారు: జేసీ దురుసు ప్రవర్తనపై అశోక్ గజపతి రాజు
చేతులు జోడించి సారీ..
కాగా, ఆ ఘటన పట్ల మాట్లాడేందుకు నిరాకరించిన ఎంపీ దివాకర్ రెడ్డి చేతులు జోడించి సారీ చెప్పారు. ఇది ఇలా ఉండగా, విమానాశ్రయంలో జేసీ దురుసు ప్రవర్తనపై విచారణకు ఆదేశించామని పౌరవిమానాయాన సంస్థ మంత్రి అశోక్ గజపతి రాజు తెలిపారు. విస్తారా, గోవాఎయిర్, ఎయిర్ ఆసియా ఇండియాతో పాటు ఎయిర్ ఇండియా, స్పైస్జెట్, జెట్ ఎయిర్వేస్, ఇండిగో సంస్థలు జేపీపై నిషేధం విధించాయి.
ఫిర్యాదు అందలేదని పోలీసులు..
ఘటన పట్ల పూర్తి విచారణ చేపడుతామని కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు స్పష్టం చేశారు. విమానాశ్రయ పోలీసులు కూడా ఈ ఘటన పట్ల స్పందించారు. అయితే ఘటన పట్ల ఇండిగో సంస్థ నుంచి ఎటువంటి ఫిర్యాదు రాలేదని ఎయిర్పోర్ట్ సీఐ తెలిపారు. ప్రాథమిక విచారణ చేపట్టామని, కానీ ఎవరూ ఎటువంటి ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదన్నారు.
జేసీ ఆలస్యంగా..
అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గురువారం విశాఖ విమానాశ్రయంలో వీరంగం సృష్టింంచిన విషయం తెలిసిందే. ఇండిగో విమానంలో ఢిల్లీ వెళ్లేందుకు ఆయన విమానాశ్రయానికి ఆలస్యంగా వచ్చారు. దీంతో అప్పటికే బోర్డింగ్ పాస్ జారీ సమయం అయిపోవడంతో సిబ్బంది కౌంటర్ మూసేశారు.
సిబ్బందితో వాగ్వాదం, వీరంగం
తనకు బోర్డింగ్ పాస్ ఇవ్వాలని సిబ్బందితో దివాకర్ రెడ్డి వాదనకు దిగారు. సమయం ముగిసిందని, ఇవ్వడం కుదరదని అక్కడి వారు చెప్పడంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. బోర్డింగ్ పాస్ ప్రింటర్ను విసిరేసి వీరంగం సృష్టించారు. జేసీ వ్యవహారంపై ఎయిర్పోర్టు సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.