పవన్ కళ్యాణే కాదు.. దేవుడు దిగివచ్చినా ఏపీకి ప్రత్యేకహోదా రాదు: జెసి
అమరావతి: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా రాదని తెలుగుదేశం పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని లోక్సభలో కేంద్ర ఆర్ధిక సహాయ మంత్రి జయంత్ సిన్హా లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంపై ఆయన స్పందించారు.
ఈ సందర్భంగా ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణే కాదు.. దేవుడు దిగివచ్చినా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాను ఇవ్వరని ఆయన తేల్చి చెప్పారు. ప్రస్తుతం పరిస్థితులు ఆంధ్రప్రదేశ్కు అనుకూలంగా లేవని ఆయన చెప్పారు.

బీజేపీ మిత్రధర్మం మరిచిందని, ప్రత్యేకహోదాపై ఆంధ్రప్రదేశ్ పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరయ్యాయని చెప్పారు. ఏపీకి ప్రత్యేకహోదా కోసం కేంద్రంలో ఎంత మందిని కలవాలో, ఎంత మందితో ప్రయత్నం చేయించాలో అంతా చేశామన్నారు. కేంద్రంలో బీజేపీకి బొటాబొటీ మెజారిటీ ఉండి ఉంటే ఏపీకి ప్రత్యేకహోదా వచ్చి ఉండేదని అన్నారు.
కానీ కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ ఉండటంతో, 36 మంది ఎంపీలు పోయినా వచ్చిన నష్టం ఏమీ లేదని భావించే ఆంధ్రప్రదేశ్కు మొండి చెయియ్ చూపించారని జెసి దివాకర్ రెడ్డి మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీల రాజీనామాలతో ఏపీకి ప్రత్యేకహోదా వస్తుందని అంటే టీడీపీకి చెందిన 16 మంది ఎంపీలురాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా ఇవ్వాలని ఆనాడు రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ చట్టంలో పొందుపరచలేదని అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా వస్తే బాగుంటుందని సామాన్య ప్రజానీకానికి ఉందని చెప్పారు. ఏపీకి ప్రత్యేకహోదా రాకపోతే దాని ప్రభావం 2019 ఎన్నికల్లో కనబడుతుందని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications