చెబితే వినే మనిషి కాదు: ప్రధాని మోడీపై జేసీ దివాకర్ తీవ్ర వ్యాఖ్యలు, ‘మళ్లీ బీజేపీనే’
న్యూఢిల్లీ/అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీలో నిరంకుశత్వం పెరిగిపోయిందని, ఆయన మూర్ఖుడంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. చెబితే అర్థం చేసుకునే మనిషి అస్సలు కాడని పేర్కొన్నారు.
మోడీలానే మంత్రులు కూడా
శుక్రవారం ఢిల్లీలో మాట్లాడుతూ.. మోడీ వద్ద ఉన్న మంత్రులు కూడా అటువంటి వారేనని అన్నారు. రైల్వే, ఆర్థిక మంత్రుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. వారు కూడా మోడీలానే నిరంకుశుల్లా తయారయ్యారన్నారు.
మళ్లీ బీజేపీనే..
మోడీ ప్రభుత్వం నుంచి ఏపీ ఏమీ సాధించలేదని జేసీ తేల్చి చెప్పారు. సాధిస్తామన్న నమ్మకం కూడా లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ బలం తగ్గుతుందేమో కానీ, అదే అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని జోస్యం చెప్పారు.
జేసీ అసహనం
కాంగ్రెస్ ఇంకా బలాన్ని పుంజుకోవాల్సి ఉందన్నారు. ఏపీలో టీడీపీకి 25 లోక్సభ స్థానాలు వస్తాయని జేసీ దివాకర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంటులో టీడీపీతో సహా అన్ని పార్టీలు నిరసనలకే పరిమితమవుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు.
ఎంపీగా సంతప్తిగా లేను..
‘నేను ఎంపీగా సంతృప్తిగా లేను.. ఒక ఎంపీగా నిర్వర్తించాల్సిన బాధ్యత పట్ల నాకు ఎలాంటి సంతృప్తి అస్సలు లేదు' అని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు.
ప్రజా విషయాలేమీ సభ ముందు తీసుకురాలేకపోతున్నామని.. అస్తమానూ ఈ నిరసనకే సమయమంతా సరిపోయిందని ఆయన చెప్పారు. ఈ ప్రభుత్వంపైన ఒక్క టీడీపీ నుంచే కాదు.. ప్రతీ పార్టీ నుంచి రోజూ నిరసన వస్తోందని జేసీ తెలిపారు.