ప్రాణం పోయేదాకా చేస్తారా?: వైసీపీ ఎంపీల దీక్షపై జేసీ సంచలనం, ‘మోడీది కక్ష సాధింపు’
న్యూఢిల్లీ/అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మంగళవారం కూడా కొనసాగుతోంది. వైసీపీ ఎంపీలు మిథున్రెడ్డి, అవినాశ్రెడ్డి కొనసాగిస్తున్న దీక్ష మంగళవారం ఐదోరోజుకు చేరుకుంది.
Recommended Video
ఐదు రోజులుగా దీక్షలో ఉండటంతో మిథున్, అవినాశ్ బాగా నీరసించిపోయారు. దీంతో వారికి డాక్టర్లు మంగళవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. మిథున్, అవినాశ్ల బ్లడ్ షుగర్ లెవల్స్ పడిపోయినట్లు వైద్యులు తెలిపారు. అవినాశ్రెడ్డి బ్లడ్ షుగర్ లెవల్స్ 78కి పడిపోయాయి. మిథున్రెడ్డి బ్లడ్ షుగర్ లెవల్స్ 80కి పడిపోయాయి.
టీడీపీ కలిసి రావాలి
ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైసీపీ ఎంపీలకు వివిధ పార్టీల నాయకులు మద్దతు పలుకుతున్నారు. దీక్షాస్థలిని సందర్శించి.. ప్రత్యేక హోదా పోరాటానికి అండగా నిలుస్తున్నారు. టీడీపీ నేతలు ఇకనైనా కళ్లుతెరిచి.. రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి రావాలని వైయస్సార్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేసి దీక్ష చేయాలని, అందరూ కలిసికట్టుగా పోరాడితే కేంద్రం దిగివస్తుందని వ్యాఖ్యానించారు.
తమిళుల తరహాలో..
కేంద్ర ప్రభుత్వంపై 13సార్లు అవిశ్వాస తీర్మానాన్ని పెట్టినా లోక్సభలో చర్చకు రాలేదని ఎంపీ మిథున్రెడ్డి అన్నారు. బీజేపీ నేతలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని, వారు దిగిరాక తప్పదని అన్నారు. తమ శక్తిమేరకు ప్రత్యేక హోదా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. జల్లికట్టు ఉద్యమంలో అందరూ కలిసికట్టుగా పోరాటం చేయడంతో సుప్రీంకోర్టు తీర్పును పక్కనబెట్టాల్సి వచ్చిందని, అదేవిధంగా టీడీపీ ఎంపీలు రాజీనామా చేసి తమతో కలిసి రావాలని, అందరూ కలిసికట్టుగా పోరాడితేనే కేంద్రం దిగివస్తుందని మిథున్రెడ్డి స్పష్టం చేశారు.
ప్రాణాలు పోయేదాకా చేస్తారా?: జేసీ విమర్శలు
ఇది ఇలా ఉండగా, వైసీపీ ఎంపీల దీక్షపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పబ్లిసిటీ కోసమే వైసీపీ ఎంపీలు దీక్షలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వైసీపీ ఎంపీలు చేసేది ఆమరణ నిరాహార దీక్ష కాదని అన్నారు. నాలుగు రోజులు తినకుంటే నీరసించడం సహజమేనన్నారు. పొట్టి శ్రీరాములు ప్రాణాలు పోయే వరకు దీక్ష చేశారని, అలా వైసీపీ ఎంపీలు చేస్తారా? అని జేసీ దివాకర్ రెడ్డి ప్రశ్నించారు. తాము ప్రధాని ఇంటి ముందు ధర్నా చేశామని అన్నారు.
అప్పుడే మేం రాజీనామాలు చేస్తాం
వైసీపీ ఎంపీలు దొంగ రాజీనామాలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని జేసీ దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి వైసీపీ రాజ్యసభ్యులతో కూడా రాజీనామా చేయిస్తే.. టీడీపీ ఎంపీలతో రాజీనామా చేయిస్తానని జేసీ వ్యాఖ్యానించారు.
మోడీ ఉన్నంత కాలం..
ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నంత కాలం ఏపీకి ప్రత్యేక హోదా రాదని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తేల్చి చెప్పారు. అలా అని నిరాశ చెందకుండా హోదా కోసం పోరాటం చేయాలని సూచించారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడును కలిసిన జేసీ దివాకర్ రెడ్డి ఢిల్లీ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ, కేంద్రంపై పోరాటం చేయాలని ఎంపీలకు బాబు సూచించారు.
మోడీది కక్ష సాధింపు.. రాహుల్ ఏం చేస్తారు?
మంత్రులపై సీబీఐ దాడులు జరుపుకోవాలనుకుంటే జరుపుకోవచ్చని జేసీ సవాల్ విసిరారు. మోడీది కక్ష సాధింపు చర్య అని, ఆయన వల్ల రాష్ట్రానికి న్యాయం జరగదని అన్నారు. సీఎం చంద్రబాబు 29సార్లు ఢిల్లీకి వెళ్లినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయని రాహుల్ గాంధీ ఇప్పుడేం చేస్తారని జేసీ ప్రశ్నించారు.