కిరణ్ పెడితే చూస్తా, జగన్ భేష్: అధిష్టానంపై జెసి మళ్లీ
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నిన్నటి వరకు సమన్యాయం అన్నప్పటికీ ఇప్పుడు సమైక్యాంధ్ర అంటున్నారని, దానికి తాను అభినందిస్తున్నానని చెప్పారు. కాంగ్రెసు పార్టీలో ఉన్న స్వేచ్ఛ మరే పార్టీలో ఉండదన్నారు. అధినాయకత్వం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చ ఇంతటితో ముగించి, సమైక్యం కోసం తీర్మానం చేయాలని పట్టుబడతామన్నారు.
విభజన నిర్ణయం ద్వారా రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ ఓ కన్ను కోల్పోయిందన్నారు. సమైక్య రాష్ట్రంలోనే తమకు న్యాయం జరుగుతుందన్నారు. విడిపోతే అనంతపురం జిల్లాలో తాగునీరు దొరకని పరిస్థితి అన్నారు. తాను తమ జిల్లా ప్రజల కోసం, పిల్లల కోసం, రైతుల కోసం సమైక్యాంధ్రను కోరుతున్నానని చెప్పారు. కొందరు నాయకులు నాలుగు గోడల మధ్య రాయల తెలంగాణ అంటూ బయటకు వచ్చినప్పుడు మాత్రం నోరు మెదపడం లేదన్నారు.
రాయలసీమ ప్రాంత నాయకులం రాష్ట్రపతిని కలిసి తమ గోడును వినిపిస్తామని చెప్పారు. ఇలాంటి అసెంబ్లీని తన జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు. నాయకుల స్వార్థం కోసం రాష్ట్రాన్ని విడగొడుతున్నారని ఆరోపించారు. విభజన జరిగితే దేశం రష్యాలా చిన్నాభిన్నం అవుతుందన్నారు. అసెంబ్లీలో సమైక్య తీర్మానం కోసం పట్టుబడతానని చెప్పారు. తనకు ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు రాలేదన్నారు.
ప్లాట్ ఫాం కోసం చూస్తున్నాం
తాము తరాలుగా కాంగ్రెసు పార్టీలో ఉన్నామని, ఇప్పుడు ఎటు వెళ్లాలో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడితే చేరే విషయంపై ఆలోచిస్తామన్నారు. కొత్త ప్లాట్ ఫాం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. సమైక్యాంధ్రపై కిరణ్ చిత్తశుద్ధిని తాము శంకించడం లేదన్నారు.