అనుకున్నది సాధించే వరకు పట్టువీడని బాబు: జెసి, ఏపీ సీఎంపై పొగడ్తల వర్షం
అనంతపురం/కాకినాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుకున్నది సాధించే వరకు పట్టువీడిని వ్యక్తి అని అనంతపురం పార్లమెంటు సభ్యుడు, టిడిపి నేత జెసి దివాకర్ రెడ్డి బుధవారం నాడు అన్నారు. కృష్ణా - గోదావరి జలాల అనుసంధానం, పట్టిసీమ ప్రాజెక్టుపై ఆయన స్పందించారు.
నదులను అనుసంధానం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని కితాబిచ్చారు. అనుసంధానం ద్వారా నీటిని ఇచ్చి చంద్రబాబు తన విశ్వసనీయతను నిరూపించుకున్నారని చెప్పారు. అనుకున్నది సాధించే వ్యక్తి చంద్రబాబు అన్నారు.
ఇది తొలి మెట్టు: చినరాజప్ప
నదుల అనుసంధానంతోనే దేశం అభివృద్ధి చెందుతుందని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప అన్నారు. దేశంలో నదుల అనుసంధానానికి ఇది తొలి మెట్టు అన్నారు. పట్టిసీమ పైన విపక్షాల రాద్ధాంతంకు ఇది కనువిప్పు అన్నారు.
నదుల అనుసంధానం దేశంలోనే తొలిసారి అన్నారు. సముద్రం పాలు అవుతున్న నీటిని నదుల అనుసంధానం ద్వారా ఉపయోగకరంగా చేస్తున్న వ్యక్తి చంద్రబాబు అన్నారు. చంద్రబాబు అపర సర్ ఆర్దర్ కాటన్ అని ప్రశంసించారు. హరికృష్ణ కూడా చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. నదుల అనుసంధానం, పట్టిసీమ ప్రాజెక్టుతో చంద్రబాబుపై ప్రశంసలు కురుస్తున్నాయి.
అంతకుముందు, జీవనదుల సంగమంలో అద్భుతఘట్టం ఆవిష్కరణ జరిగింది. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా - గోదావరి నదుల అనుసంధానం ప్రాశస్త్యంపై ఏర్పాటు చేసిన పైలాన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు.
అనంతరం ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద కృష్ణా-గోదావరి నదుల సంగమ ప్రదేశంలో చంద్రబాబు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఏపీ సభాపతి కోడెల శివప్రసాదరావు, ఏపీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వ రావు, కామినేని శ్రీనివాస్ రావు, విశాఖ ఎంపీ హరిబాబు, ఏలూరు ఎంపీ మాగంటిబాబు తదితరులు పాల్గొన్నారు.