జనం చంద్రబాబు మేలంటున్నారు - వైసీపీకీ ఈ రోజు కార్యకర్తలు లేరు : జేసీ కీలక వ్యాఖ్యలు..!!
టీడీపీ..వైసీపీ పైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీ ఎమ్మెల్యేలు గడప గడప కు ప్రభుత్వం పేరుతో వాలంటీర్ ను వెంటబెట్టుకొని వెళుతున్నారన్నారు. జగనన్నను దీవించండి అని అడుగుతున్నారని చెప్పుకొచ్చారు. ఆ పార్టీకి ఈ రోజు కార్యకర్తలు లేరని వ్యాఖ్యానించారు. వారిని అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు పట్టించుకోవటం లేదని చెప్పారు. ఎమ్మెల్యేల వెనుక సచివాలయాల సిబ్బంది..అధికారులు..పోలీసులు వెళ్తున్నారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ను వయసు అయిపోయింది అంటున్నారని... ఆయన బయట తిరుగుతున్నారని పేర్కొన్నారు.
సీఎం వస్తున్నాడు అంటే షాపులు ముయ్యాలి... ఆరు వందల మంది పోలీసులు ఉండాలంటూ జేసీ వివరించారు. జనం ముసలోడు అయినా చంద్రబాబు మేలు అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. పోలీసు అనే మహా వృక్షం కింద వైసీపీ ఉందిని ధ్వజమెత్తారు. ఆ పార్టీ పై కార్యకర్తల్లో ద్వేషం చాలా ఉందని పేర్కొన్నారు. టీడీపీ నేతలు మూడేళ్లు ఇళ్లళ్లోనే కూర్చున్నామని చెప్పారు. టీడీపీ కార్యకర్తలు జైలుకు వెళ్లారని..ఎన్నికల్లో ఇబ్బంది పడ్డారంటూ వివరించారు. గతంలో తన పైనా కేసు పెట్టారని గుర్తు చేసారు. అధికారం లో ఉన్నప్పుడు ఎంజాయ్ చేశారు.. అనంతరం కార్యకర్తలను మరిచాం అంటూ టీడీపీ నేతలను ఉద్దేశించి మాట్లాడారు.
ఆ పార్టీలో సీట్లు రావని తెలిసి ఎమ్మెల్యేలు జగన్ ను దీవించండి అంటున్నారని ఎద్దేవా చేసారు. మనం చంద్రబాబు ను సీఎం ను చేసుకోవాలని... అందుకోసం జైలుకు వెళ్ళడానికి సిద్ధమని జేసీ చెప్పారు. కార్యకర్తలు కదిలిరంది... చంద్రబాబు ను సీఎం ను చేయండంటూ నినదించారు. ఇప్పటికీ సీటు మాకే కావాలని మా నాయకులు అడుగుతున్నారన్నారు. అందుకే నేతలకు మా నాయకుడు త్యాగం చేయమని చెబుతున్నారంటూ చెప్పుకొచ్చారు. గౌరవంగా మా నాయకుడు చెబుతున్నారు... సీటు ఇవ్వనని త్యాగం చేయండి అంటున్నారని వ్యాఖ్యానించారు.