డీఎస్పీ చైతన్య కావాలనే తమపనికి అడ్డుపడుతున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
అనంతపురం జిల్లా పేరు పలకగానే జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబం గుర్తుకు వస్తుంది. జేసీ సోదరులు ఎక్కడున్నా ఏం చేసినా సంచలనమే అవుతుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ వారి కుటుంబానికి మాత్రం ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ప్రత్యర్థి పార్టీవారైనా, సొంత పార్టీవారైనా తప్పు చేస్తే బహిరంగంగా ఖండిస్తారు. జేసీప్రభాకర్ రెడ్డి కొద్ది కాలంగా తాడిపత్రి డీఎస్పీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా మరోసారి డీఎస్పీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ ఫ్యామిలీ వార్తల్లో నిలుస్తూనే ఉంది ట్రావెల్స్ కానీ, ఇతర వ్యాపారం కానీ ఏదైనప్పటికీ వార్తల్లో నిలవడం మాత్రం కామన్.
డీఎస్పీ చైతన్య కావాలనే తమపనికి అడ్డుపడుతున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. "నన్ను ఎన్ కౌంటర్ చేస్తావా?... నీ బతుకు ఎంత? చైతన్య.. నా విషయంలో పర్సనల్ గా వెళుతున్నట్లు అర్థమవుతోంది.. మేం తిరగబడితే తట్టుకోలేవన్నారు. ఆయనది మనిషి పుట్టుక కాదు, ఏ జాతికి చెందినవారు తెలియదు" అంటూ వ్యాఖ్యానించారు. చైతన్యపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారికాదు.. సందర్భాన్ని బట్టి తీవ్రంగానే స్పందిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం జేసీ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో తాడిపత్రి నుంచి మున్సిపల్ చైర్మన్ గా విజయం సాధించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రి నుంచి అతని తనయుడు గత ఎన్నికల్లో ఓటమిపాలవగా, అనంతపురం లోక్ సభ స్థానం నుంచి దివాకర్ రెడ్డి తనయుడు ఓటమిపాలయ్యారు. వచ్చే ఎన్నికల్లో కూడా వారిద్దరే పోటీచేస్తారని వీరు చెప్పినప్పటికీ వారి తనయులు కాకుండా దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి పోటీచేయాలని చంద్రబాబు చెప్పారు.