బాబుకు జెసి సోదరుడి ప్రశంస, బస్సు ప్రమాదం పైనా..
ఆయన దూరదృష్టి పైన తనకు మొదటి నుండి విశ్వాసముందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రం పరిస్థితి అగమ్య గోచరంగా ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముందుచూపున్న చంద్రబాబు మాత్రమే రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్లగలరని ఆయన చెప్పారు.
తాను టిడిపిలో చేరుతానా లేదా అన్నది విషయం కాదని ఆ పార్టీలో చేరే విషయాన్ని కొట్టి పారేశారు. తన సోదరుడు టిడిపిలోకి వెళ్లేందుకు సిద్ధంగా లేరని, ఆయన దారిలోనే తాను నడుస్తానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి టిక్కెట్ ఇస్తే పోటీ చేస్తారా అంటే అప్పుడు చూద్దామన్న విధంగా మాట్లాడారు. కాగా కొంతకాలంగా జెసి సోదరులు టిడిపి వైపు చూస్తున్నట్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
మహబూబ్ నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన వోల్వో బస్సు ప్రమాదం పైన సిఐడి విచారణను తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. ఆర్టీసి బస్సులనే లీజుకు ఇచ్చినప్పుడు లేని తప్పు మేము ఇస్తే తప్పు అవుతుందా అని ప్రశ్నించారు.
హోంకు కిషన్ నివేదిక
విభజన అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణ బిల్లు ఎప్పుడు పెడతారో స్పష్టం చేయాలని, తాము హైదరాబాదుతో కూడిన తెలంగాణకు కట్టుబడి ఉన్నామని, బిల్లు పెడితే మద్దతిస్తామని పేర్కొన్నారు. కాంగ్రెసు పార్టీ సభ్యులు లేకుండా విభజన అంశంపై కమిటీ వేయాలని, నీటి పంపకాలు, సీమాంధ్రుల భద్రత పైన నమ్మకం కలిగించాలని కోరారు.
టి కాంగ్రెస్ పైన కడియం
తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు ఏం సాధించారని కృతజ్ఞత సభలు నిర్వహిస్తున్నారని తెరాస సీనియర్ నేత కడియం శ్రీహరి వరంగల్ జిల్లాలో ప్రశ్నించారు. చర్చలు, సమావేశాల పేరుతో కాంగ్రెసు కాలయాపన చేస్తోందని ఆరోపించారు. హైదరాబాదు పైన ఆంక్షలు విధిస్తారనే ప్రచారం జరుగుతున్నా తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు ఎందుకు స్పందించడం లేదో చెప్పాలన్నారు.