మా బాధ మీకేం తెలుసు: హోదాపై సభలో జైరాం మీద ఊగిపోయిన శీలం
న్యూఢిల్లీ: రాజ్యసభలో శుక్రవారం నాడు ఏపీకి ప్రత్యేక హోదా పైన చర్చ జరిగింది. ఏపీకి హోదా కోసం ప్రయివేటు మెంబర్ బిల్లు సందర్భంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ జేడీ శీలం ఊగిపోయారు. ఓ సమయంలో మా బాధ మీకేం తెలుసని సొంత పార్టీ నేత జైరామ్ రమేష్ పైన జేడీ శీలం ఆగ్రహం వ్యక్తం చేశారు.
తొలుత కేవీపీ రామచంద్ర రావు మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ... అమరావతిని ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని కెవిపి రామచంద్ర రావు చెప్పారు. అమరావతిని అనుసంధానం చేస్తూ రోడ్ కనెక్టివిటీని పెంచాలన్నారు. ఏపీ ఆర్థికంగా నిలదొక్కుకునే వరకు పదివేల కోట్ల రూపాయలు ఇవ్వాలన్నారు.
ఏపీకి బుందేల్ ఖండ్ తరహా ఆర్థిక సాయం కావాలన్నారు. బుందేల్ ఖండ్, కోరావుట్, బొలంగీర్, కలహండి తదితరాల తరహాలో రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు కూడా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్దేశిత సమయంలో పూర్తయ్యేలా నిధులు ఇవ్వాలన్నారు.
విజయవాడ, విశాఖ, తిరుపతిలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా చేయాలన్నారు. విభజన చట్టంలోని అంశాలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. విశాఖ రైల్వే జోన్, ప్రత్యేక హైకోర్టు త్వరగా ఏర్పాటు చేయాలన్నారు. దాదాపు 20 కీలక అంశాలను చట్టంలో పొందుపర్చాలన్నారు.
ఊగిపోయిన జేడీ శీలం
ఏపీ రెవెన్యూ లోటును కేంద్రం భర్తీ చేయాలని జేడీ శీలం అన్నారు. నాడు హామీలు ఇచ్చిన వారు ఇప్పుడు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. నాడు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పోలవరం నిధుల సంగతి ఏమిటని ప్రశ్నించారు.
విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీల పైన ప్రధాని, ఏపీ ముఖ్యమంత్రి స్పందించాలని డిమాండ్ చేశారు. ఆర్థిక లోటును భర్తీ చేసేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించలేదన్నారు. రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించలేదన్నారు. కేంద్ర సంస్థలకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు.
పలు కేంద్ర సంస్థలను ప్రారంభిస్తున్నారని, కానీ నిధుల గురించి చెప్పడం లేదన్నారు. విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీలు కొట్లాడారని, ఇప్పుడు వారు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనన్నారు. ప్రత్యేక హోదా పైన కేంద్రం నోరు విప్పడం లేదన్నారు. మనసు ఉంటే మార్గం ఉంటుందని, అలాగే ఏపీకి ఇచ్చిన హామీల విషయంలో కేంద్రం మనసు ఉంటే తీర్చగలుగుతుందని చెప్పారు. వెంటనే హామీలు అమలు చేయాలన్నారు.
ప్రత్యేక హోదా కోసం ఎవరి సిఫార్సులు అవసరం లేదని, పార్లమెంటు చేయవచ్చునని జేడీ శీలం అన్నారు. ఏపీలో పారిశ్రామిక వర్గాల కోసం రాయితీలు ఇవ్వాలన్నారు. ఏపీకి పదేళ్లు అని అడిగిన వెంకయ్య నాయుడు ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చే నిబంధనలు ఏపీకి వర్తించవన్న వాదన సరికాదన్నారు.