"జనం ఇప్పటికీ మాట్లాడుకుంటారు!.. దేవినేని వదినను చంపేశాడని"
దేవినేని ఉమా ఓ పిట్టలదొర అని, ఇరిగేషన్ మంత్రిగా ఆయన పనికిరారని విమర్శించారు. వైస్ జగన్ గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదని మండిపడ్డారు.
విజయవాడ: ప్రతిపక్ష అధినేత జగన్ను టార్గెట్ చేసినందుకు ఏపీ మంత్రి దేవినేనిపై నిప్పులు చెరిగారు వైసీపీ నేత జోగి రమేష్. దేవినేని ఉమా తన వదినను చంపేశారని జనం ఇప్పటికీ మాట్లాడుకుంటుంటారని ఆరోపించారు. ఇరిగేషన్ శాఖలో దేవినేని కమిషన్ ఏజెంట్ లా మారిపోయారని, బ్రోకర్ లా వ్యవహరిస్తూ.. పెదబాబుకు ఇంత, చినబాబుకు అంత అంటూ డబ్బులు దండుకుంటున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కళ్ల ముందు జైలు వూచలు కనబడేసరికి జగన్ వెళ్లి మోడీ కాళ్లపై పడ్డారు : దేవినేని ఉమా
దేవినేని ఉమా ఓ పిట్టలదొర అని, ఇరిగేషన్ మంత్రిగా ఆయన పనికిరారని విమర్శించారు. వైస్ జగన్ గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదని మండిపడ్డారు. ప్రజల తరుపున పోరాడే జగన్ లాంటి వ్యక్తుల గురించి మాట్లాడే అర్హత ఆయనకెక్కడిది? అని ప్రశ్నించారు. 'మైలవరానికి తాగునీరు ఇవ్వలేని నువ్వు.. సొల్లు కబుర్లు చెబుతున్నావు. మంచినీళ్లు ఇవ్వలేని దద్దమ్మవు సిగ్గులేకుండా మాట్లాడుతావా?' అంటూ నిలదీశారు.
పోలవరాన్ని సాధించిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డిది అని, దీనిపై ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు సిద్దమని దేవినేనికి జోగి రమేష్ సవాల్ విసిరారు. ఎన్టీఆర్ను రాళ్లతో, చెప్పులతో కొట్టించిన చరిత్ర చంద్రబాబుదని, గతంలో 9ఏళ్లు సీఎంగా ఉన్న ఆయన ఏనాడైనా పోలవరం గురించి మాట్లాడారా? అని ప్రశ్నించారు. మనసులో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తలుచుకుంటే.. చంద్రబాబు తాను చేసిన సగం పాపాలనైనా పోగుట్టుకున్నవాడవుతాడని పేర్కొన్నారు.
రైలు ప్రమాదంలో దుర్మరణం పాలైన దేవినేని వెంకటరమణ:
1999లో గోదావరి ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో.. ఏసీ కోచ్ లో ప్రయాణిస్తున్న దేవినేని వెంకట రమణ(38) దుర్మరణం చెందారు. పార్టీలో బలమైన నేతగా ఎదిగిన ఆయన.. విద్యాశాఖ మంత్రి గాను పనిచేశారు. వెంకటరమణ రైలు ప్రమాదంలో మరణించిన రోజు రాత్రే.. ఆయన భార్య కూడా మరణించడం అప్పట్లో సంచలనంగా మారింది.
దేవినేని రాజకీయ ప్రత్యర్థులు.. దీని వెనకాల రాజకీయ కోణం ఉందని ఆరోపిస్తుంటారు. గతంలో వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ కూడా ఈ విషయంలో దేవినేని ఉమాపై ఆరోపణలు చేశారు. దేవినేని వెంకటరమణ స్థానంలో ఆయన భార్య రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తుందని భావిస్తున్న తరుణంలో.. ఆమెను చంపడం ద్వారా దేవినేని ఉమా ఆ స్థానంలోకి వచ్చారని గతంలో వాసిరెడ్డి పద్మ ఆరోపించారు.