బాబు వెన్నుపోటు-యనమల ముందుపోటు: జోగి తీవ్ర వ్యాఖ్యలు
విజయవాడ: ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత జోగి రమేష్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దివంగత నేత ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడించింది టీడీపీ నేతలేనని మండిపడ్డారు. చంద్రబాబు వెనుకనుంచి వెన్నుపోటు పొడిస్తే.. యనమల రామకృష్ణుడు ముందునుంచి ఎన్టీఆర్ను పొడిచారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
విజయవాడలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. యనమల నోటిని ఫినాయిల్తో శుభ్రం చేసుకోవాలని జోగి సూచించారు. గతంలో అతను స్పీకర్ కుర్చీకే ఆయన తీరని మచ్చ తెచ్చారని విమర్శించారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలతో ఆనాడు ఎన్టీఆర్ అసెంబ్లీకి దూరంగా ఉన్నారని, అందుకే ఎన్టీఆర్ చూపిన బాటలోనే అనైతిక రాజకీయాలకు వ్యతిరేకంగా తామూ నడుస్తామని చెప్పామని జోగి చెప్పారు.
ధర్మమే గెలిచింది: పార్థసారథి
అధికారం అండతో టీడీపీ దౌర్జన్యం చేయాలని యత్నించినా చివరకు ధర్మమమే గెలిచిందని వైయస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారథి అన్నారు. జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విజయంపై వైయస్సాఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా తో మాట్లాడారు. టీడీపీ ముఖ్యనేతలు, కార్యకర్తలు ఇలా అంతా వచ్చి భయానక వాతావరణం సృష్టించినా ప్రభుత్వం పాచికలు పారలేదని పార్థసారథి తెలిపారు.
చివరకు అధికారులపై దాడికి కూడా ప్యూహరచన చేశారని.. మానసిక ఒత్తిడి తీసుకొచ్చేందుకు యత్నించారని పార్థసారథి ఆరోపించారు. ఎన్నికల అధికారి ఒకవేళ ఎన్నికలు నిర్వహిస్తే ఎంపీ నేతృత్వంలో దాడి చేసేందుకు పోడియం చుట్టు చేరారని ఆయన అన్నారు. వారి దౌర్జన్యకాండ మొత్తం మీడియాలో ప్రజలంతా చూశారని ఆయన చెప్పుకొచ్చారు. ఇలాంటి చర్యలతో పనులు చేయించుకోవటమే పనా? అని చంద్రబాబును పార్థసారథి నిలదీశారు.