పవన్ కళ్యాణ్కు జేపీ సవాల్, మోడీ స్కీంలో ఎప్పుడు..?
హైదరాబాద్/న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు లోక్సత్తా అధ్యక్షుడు, మాజీ శాసన సభ్యుడు జయప్రకాష్ నారాయణ కూకట్పల్లిలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఆయన వీధులను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేశారు.
అంతేకాదు, ఆయన కొందరిని స్వచ్ఛ భారత్కు నామినేట్ చేశారు. జనసేన అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అరుణా రాయ్, రాజ్దీప్ సర్దేశాయ్, నందన్ నీలేకనిలు స్వచ్ఛభారత్లో పాల్గొనాలని సవాల్ విసిరారు. తాను స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నానని పేర్కొన్నారు.
దీనిపై ప్రధాని మోడీ స్పందిస్తూ ట్వీట్ చేశారు. ఇది చాలా అద్భుతమని, స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందన్నారు. గతంలోను పీవీ సింధు తదితరులు పవన్ కళ్యాణ్ను నామినేట్ చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు పవన్ బీజేపీ - టీడీపీ కూటమికి మద్దతు పలికారు. బీజేపీ పవర్ స్టార్కు మంచి ప్రాధాన్యత ఇచ్చింది. మోడీ చేపట్టిన ఈ కార్యక్రమంలో పవన్ ఎప్పుడు పాల్గొంటారని అభిమానులతో పాటు అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కాగా, స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా చీపురు పట్టిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కూడా జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను నామినేట్ చేసిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల క్రితం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న సింధు పవన్, లియాండర్ పేస్, గుత్తా జ్వాలలను నామినేట్ చేశారు.
స్వచ్ఛ భారత్లో భాగంగా తొలుత ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిది మంది పేర్లను ప్రస్తావించారు. ఆ జాబితాలోని టెన్నిస్ స్టార్ సానియా మీర్జా స్వచ్ఛ భారత్లో పాల్గొని తానూ తొమ్మిది మందిని ప్రకటించారు. ఆ పేర్లలో పీవీ సింధూ ఒకరు. సానియా మీర్జా ఆహ్వానాన్ని మన్నించిన పీవీ సింధూ శనివారం స్వచ్ఛ భారత్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పై ముగ్గురు ప్రముఖుల పేర్లకు సవాల్ చేశారు.
పివి సింధు శనివారం నాడు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొని, రోడ్డును శుభ్రం చేశారు. ఆ తర్వాత మొక్కలు నాటారు. నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోంది. పలువురు సినీ ప్రముఖులు, క్రీడాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.