నేను ఎక్కడివాడిని: అసెంబ్లీలో జెపి ధర్మ సందేహం
హైదరాబాద్: తన బాల్యం మహారాష్ట్రలో గడిచిందని, విద్యాభ్యాసం కోస్తాంధ్రలో సాగిందని, శాసనశభకు ఎన్నికైంది హైదరాబాద్ నుంచి అని లోకసత్తా శాసనసభ్యుడు జయప్రకాష్ నారాయణ ఇంతకీ తాను ఏ ప్రాంతంవాడిని అని ప్రశ్నించారు. ఈ మాటలతో ఆయన శనివారం శాసనసభలో తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చలో పాల్గొంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
అస్తిత్వాలు ఉండవచ్చునని, అయితే అవి ఆసూయకు, ద్వేషానికి దారి తీయకూడదని ఆయన అన్నారు. ప్రస్తుతం ఆంధ్రావని అంపశయ్యపై ఉందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనతో పచ్చని నేలపై చిచ్చు రేగిందని ఆయన అన్నారు.

మన రాజకీయాలు మార్చుకోకపోతే ఎన్ని రాష్ట్రాలు ఏర్పడినా ప్రయోజనం ఉండదని ఆయన అన్నారు. 610 జీవో ప్రకారం 14 వేల ఉద్యోగాల్లో ఉల్లంఘన జరిగినట్లు తమ పార్టీ గుర్తించిందని, దాన్ని సరిచేయాలని ఆయన అన్నారు. రాజకీయం అంటే గనులు, లీజులు, కాంట్రాక్టులు కాదని ఆయన అన్నారు.
ఆర్థిక వికేంద్రీకరణ జరిగి 23 జిల్లాల్లో కూడా నగరాలు ఏర్పడాలని ఆయన అన్నారు. రాజధానిని కూడా విభజించాలని ఆయన అన్నారు. హైకోర్టు, శాసనసభలను రాష్ట్రానికి ఒక్కటి ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. తనకు అప్పగిస్తే విభజనపై మూడు ప్రాంతాల మధ్య ఏకాభిప్రాయం సాధిస్తానని ఆయన చెప్పారు.
దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడిన వ్యక్తి పివి నర్సింహారావు అని కొనియాడారు. ప్రాంతీయ పార్టీలతో ఫెడరల్ వ్యవస్థ నిలడిందన్నారు. విభజన సమాఖ్య వ్యవస్థకు ప్రమాదం రాకూడదన్నారు. రాజ్యాంగం ప్రకారం పుట్టిన స్థలం ఆధారంగా ఏ వివక్ష ఊండకూడ దని జెపి తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మినహా నివసించేందుకు ఎక్కడా పరిమితుల్లేవని వెల్లడించారు.
హైదరాబాద్ ఆదాయంపై అన్ని ప్రాంతాలూ ఆధారపడి ఉన్నాయన్నారు. కోస్తాలో ఆదాయ వ్యయాల మధ్య తేడాలేదని, రాయలసీమలో రూ.7500 కోట్ల లోటుందని తెలియజేశారు. హైదరాబాద్ను మినహాయిస్తే తెలంగాణలో రూ.8400 కోట్ల లోటు ఉందని తెలిపారు. మాన్యుఫాక్చరింగ్ రంగంలో సీమ వెనుకబడిందని, తెలంగాణలో 11 శాతం, కోస్తాలో 8.5 శాతం ఉత్పత్తి ఉందన్నారు.












Click it and Unblock the Notifications