పవన్ కల్యాణ్ రావొచ్చు, లోకసభకు పోటీ యోచన: జెపి
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తమ పార్టీలోకి వస్తే సాదరంగా ఆహ్వానిస్తామని లోక్ సత్తా పార్టీ అధ్యక్షులు, కూకట్ పల్లి శాసన సభ్యులు జయప్రకాశ్ నారాయణ శనివారం అన్నారు. ప్రస్తుత రాజకీయాలు ప్రయివేటు ఎస్టేట్లుగా మారిపోయాయని, రాజకీయాల్లో పూర్తిగా వ్యాపార ధోరణి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీలో పవన్ చేరిక విషయమై విలేకరులో ప్రశ్నిస్తే.. పవన్ తమ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో తాను పార్లమెంటుకు పోటీ చేయాలని పార్టీ సూచించిందని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తును తాము స్వాగతించామని కానీ, ఆ పార్టీ తమ వ్యక్తిగత ధోరణిలో వెళ్తోందని ఆరోపించారు.
ఈ ఎన్నికలు తెలంగాణలో భవిష్యత్తును మార్చాలని ఆకాంక్షించారు. తమ రాష్ట్రం తమకు కావాలని పోరాడిన యువకుల చైతన్యం ప్రదర్శించి మంచి పాలకులు రావడానికి ప్రయత్నంచాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అంటే కెసిఆర్, ఆయన కుటుంబం, కాంగ్రెసు అంటే సోనియా, రాహుల్, టిడిపి అటే చంద్రబాబు, ఆయన కుటుంబ పెత్తనం కనిపిస్తుందన్నారు.
ఓటు బ్యాంకు రాజకీయాలను తరిమి కొట్టాలన్నారు. పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణకు ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు. కృష్ణా నదిలో మిగులు జలాలు లేవని, గోదావరి నీళ్లు పోలవరం ద్వారా కృష్ణాకు మళ్లిస్తేనే అక్కడ నిర్మిస్తున్న ప్రాజెక్టులకు సాగునీరు వస్తుందన్నారు.