చంద్రబాబును వెంటాడుతున్న జూ ఎన్టీఆర్: నాటి పవన్ తో భేటీ గుర్తు చేస్తూ : అధినేత టూర్ లో తమ్ముళ్ల షాక్..!!
టీడీపీలో కొత్త వాయిస్ వినిపిస్తోంది. అధినేత మందే తమ్ముళ్లు కొత్త నాయకత్వం కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పార్టీలో జోష్ తెచ్చే నాయకుడు కావాలంటూ స్లోగన్స్ ఇస్తున్నారు. అందు కోసం కార్యకర్తలకు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ దిక్సూచిగా కనిపిస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు ముందే కార్యకర్తలు జై ఎన్టీఆర్ అంటూ జూనియర్ జెండాలు పట్టుకొని హంగామా చేసారు. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో చోటు చేసుకున్న విధంగానే, తిరిగి ఇప్పుడు మచిలీపట్నం పర్యటనలోనూ రిపీట్ అయింది.

బాబు ముందే జూ ఎన్టీఆర్ నినాదాలు..
చంద్రబాబు మచిలీపట్నం పార్లమెంట్ పరిధి పర్యటనలో భాగంగా మాజీ మంత్రి నడకుదుటి నర్సింహారావు మృతి పురస్కరించుకొని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కుటుంబ సభ్యులను పరామర్శించటానికి మచిలీపట్నం చేరుకున్నారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. అందులో పలువురు కార్యకర్తలు పెద్ద సైజులో జూనియర్ ఎన్టీఆర్ బొమ్మలతో ఉన్న జెండాలను ప్రదర్శించారు.
పట్టణంలో అనేక ప్రాంతాల్లో పార్టీ ఫ్లెక్సీలపైన జూనియర్ ఎన్టీఆర్ ఫొటోతో ఏర్పాటు చేసారు. గతంలో కుప్పంలో ఇదే విధంగా జరిగిన సమయంలో కార్యకర్తలు డైరెక్టుగా చంద్రబాబునే ప్రశ్నించారు. జూనియర్ ను పార్టీలోకి తీసుకురావాలని...ఆయన తో ప్రచారం చేయించాలని కోరారు.

చంద్రబాబు మౌనం..దేనికి సంకేతం
మౌనంగా వినటం మినహా చంద్రబాబును నుంచి సమాధానం రాలేదు. టీడీపీ పట్టు ఉన్న క్రిష్ణా జిల్లాల్లోనూ ఇప్పడు అదే రకమైన డిమాండ్లు వినిపిస్తున్నాయి. చంద్రబాబు చూస్తూ ఉండటం మినహా వారిని వారించలేరు...నో అని చెప్పలేరు..ఎస్ అంటూ అంగీకరించలేరు. అయితే, 2019 లో పార్టీ పరాజయం..అప్పటి నుండి జరిగిన అన్ని ఎన్నికల్లోనూ పార్టీ ఓటమితో పార్టీ కేడర్ లో కొత్త నాయకత్వం కావాలనే డిమాండ్ పెరుగుతోంది. 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ కు మంచి ఆదరణ లభించింది. ఆయన రాజకీయ ప్రసంగాలు సైతం ఆకట్టుకొనే విధంగా ఉన్నాయి.

నాడు పవన్ కోసం ఇంటికి వెళ్లి మరీ..
అయితే, 2014 ఎన్నికల్లోనూ తిరిగి జూనియర్ ప్రచారం చేస్తారని భావించినా అది జరగలేదు. అప్పటికే పార్టీలో లోకేశ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్- బీజేపీతో పొత్తు వంటివి పార్టీ గెలుపుకు సహకరించాయి. అయితే, 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు స్వయంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి మద్దతు కోరారు. ఇప్పుడు పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలకే పరిమితం అయిన జూనియర్ ఎన్టీఆర్ ను తిరిగి పార్టీ ప్రచారానికి ఆహ్వానించలేరా అనే స్వరాలు వినిపిస్తున్నాయి.
Recommended Video

జూనియర్ ను కోరుకుంటున్న పార్టీ శ్రేణులు..
నాడు పవన్ దగ్గరకు వెళ్లిన వారు..నేడు జూనియర్ ను ఆహ్వానించటానికి అభ్యంతరం ఏంటనేది సీనియర్ల అంతర్గత చర్చల్లో వస్తున్న ప్రశ్న. కుమారుడు లోకేశ్ కు పోటీ కాకూడదనే జూనియర్ ను దూరంగా ఉంచారనే ప్రచారమూ ఉంది. అయితే, జూనియర్ ఎంట్రీ..ప్రాధాన్యత పైన గతంలో లోకేశ్ చేసిన వ్యాఖ్యలను సీనియర్లు గుర్తు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం బాలయ్య సైతం జూనియర్ రీ ఎంట్రీ పైన అంత సుముఖంగా లేరనే విధంగా వ్యాఖ్యలు వినిపించాయి.
అయితే, కార్యకర్తలు మాత్రం జూనియర్ రావాలని కోరుకుంటున్నారు. దీంతో..ఈ సారి 2024 ఎన్నికలు టీడీపీకి జీవన్మరణ సమస్యగా మారబోతున్నాయి. దీంతో, చంద్రబాబు సైతం జూనియర్ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications