కిరణ్కు ఝలక్: టిడిపిలోకి నలుగురు అభ్యర్థులు జంప్
గుంటూరు: మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలోని జై సమైక్యాంధ్ర పార్టీకి గుంటూరు జిల్లాలో నలుగురు పార్టీ అభ్యర్థులు ఝలక్ ఇచ్చారు. ఈ అనూహ్య పరిణామానికి జై సమైక్యాంధ్ర పార్టీ నేతలు దిమ్మెరపోయారు. చిలకలూరిపేట ఎన్నికల ప్రచార సభలో పాల్గొనేందుకు వచ్చిన చంద్రబాబు సమక్షంలో జెఎస్పి అభ్యర్థులు మేడూరి ఆంజనేయులు (చిలకలూరిపేట), మేడం రమేష్ (వినుకొండ), పులుసు సత్యారెడ్డి (మాచర్ల), కోలా అప్పిరెడ్డి (గురజాల) తెదేపాలో చేరిపోయారు.
ఈ నలుగురు అభ్యర్థులు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రాయపాటి సాంబశివరావు పోటీ చేస్తున్న నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అభ్యర్థులు కావడం విశేషం. ప్రచారం చివరిరోజు నరసరావుపేట పార్లమెంట్ టిడిపి అభ్యర్థి రాయపాటి సాంబశివరావు తన రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శించారు. బిసి ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య సోమవారం రాయపాటికి సంఘీభావం ప్రకటించడం మరో పరిణామం.

ఇదిలావుండగా ప్రచార గడువు మరో గంటలో ముగుస్తుందనగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు గుంటూరు కలెక్టర్ను కలిసి ఓ వినతిపత్రం అందజేశారు. ఎన్నికలు జరిగేరోజు పోలింగ్ కేంద్రాల్లో సీలింగ్ ఫ్యాన్లు లేకుండా చూడాలని, వైయస్సార్ కాంగ్రెస్ ఎన్నికల గుర్తు సీలింగ్ ఫ్యాన్ అయినందున వారి ఏజెంట్లు పైకి చూపించి తమ పార్టీకి ఓటేయమని చెప్పే అవకాశముందని, ఇలా ఓటర్లను ప్రభావితం చేసేందుకు వ్యూహరచన చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన వినతిపత్రంలో అన్నారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వైఎస్సార్సిపి నేతలు దొంగనోట్లు, నకిలీ మద్యం యథేచ్ఛగా పంపిణీ చేస్తున్నారని, వాటిని అరికట్టాల్సిందిగా మరో వినతిపత్రం కలెక్టర్కు అందజేశారు. కాగా, గుంటూరు శివార్లలో ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద విధినిర్వహణలో అలక్ష్యం వహించారనే కారణంపై గుంటూరు-2 ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మధుసూదనరావును కలెక్టర్ సురేష్కుమార్ ఆదేశాలపై సస్పెండ్ చేశారు.












Click it and Unblock the Notifications