ఏపీ హైకోర్టుకు కొత్త న్యాయమూర్తులు-
అమరావతి: ఏపీ హైకోర్టుకు కొత్తగా ఇద్దరు న్యాయమూర్తులు రానున్నారు. జ్యుడీషియల్ అధికారుల కోటా నుంచి వారిని ఎంపిక చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని కొలీజియం ఈ మేరకు వారి పేర్లను సిఫారసు చేసింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపించింది.
కిరణ్ రిజిజు సారథ్యంలోని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఈ సిఫారసులపై ఆమోదముద్ర వేయాల్సి ఉంది. సాధారణంగా సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులను కేంద్రం యధాతథంగా ఆమోదిస్తుంటుంది. ఏవైనా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప ఈ సిఫారసులను గానీ, ప్రతిపాదనలను గానీ తిప్పి పంపిస్తుంటుంది. ఇది చాలా అరుదు.
ఇప్పుడు తాజాగా ఇద్దరు జ్యుడీషియల్ అధికారులను సుప్రీంకోర్టు కొలీజియం న్యాయమూర్తులుగా ఎలివేట్ చేసింది. జ్యుడీషియరీ అధికారులుగా పని చేస్తోన్న పీ వెంకట జ్యోతిర్మయి, వీ గోపాలకృష్ణ రావులను ఏపీ హైకోర్టులో న్యాయమూర్తులుగా ఎలివేట్ చేస్తూ సిఫారసులను కేంద్రానికి పంపించింది.
ఇదివరకు సుప్రీంకోర్టు కొలీజియం.. ఏపీ హైకోర్టుకు ఏడుమంది న్యాయమూర్తులను నియమించిన విషయం తెలిసిందే. అడుసుమిల్లి వెంకట రవీంద్రబాబు, వక్కలగడ్డ రాధాకృష్ణ కృపా సాగర్, శ్యామ్ సుందర్ బండారు, శ్రీనివాస్ ఊటుకూరు, బొపన్న వరహా లక్ష్మీనరసింహ చక్రవర్తి, తల్లాప్రగడ మల్లికార్జున రావు, దుప్పల వెంకటరమణ ఉన్నారు.
గత ఏడాది జులై 20వ తేదీన వారిని నియమించింది కొలీజియం. తాజాగా పీ వెంకట జ్యోతిర్మయి, వీ గోపాలకృష్ణ రావులను ఎలివేట్ చేసింది. దీనితో న్యాయమూర్తుల సంఖ్య పెరిగింది. ఇంకా నాలుగు పోస్టులు ఖాళీగానే ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని కూడా కొలీజియం త్వరలోనే భర్తీ చేసే అవకాశాలు లేకపోలేదు.