ఏపీ హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తుల నియామకం..!!
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కొత్తగా ఇద్దరు అదనపు న్యాయమూర్తులు నియమితులయ్యారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కొత్తగా ఇద్దరు అదనపు న్యాయమూర్తుల నియమకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసారు. వీరి నియామకానికి సంబంధించి కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీ హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తులు ఉండాలి. ప్రస్తుతం ఆ సంఖ్య 30గా ఉంది. ప్రతాప వెంకట జ్యోతిర్మయు, వి.గోపాలకృష్ణారావుకు అదనపు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం ఈ నెల 10వ తేదీన సిఫార్సు చేసింది. వీటికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. వీరి నియామకం పైన కేంద్ర న్యాయశాఖ నోటిఫిషన్ తో నియామకం పూర్తయింది. వీరిద్దరి నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 32కి చేరనుంది.
న్యాయమూర్తిగా నియమితులైన వెంకట జ్యోతిర్మయి గుంటూరు జిల్లా తెనాలి వాసి. ఈమె తల్లిదండ్రులు బాలాత్రిపుర సుందరి, పీవీకే శాస్త్రి. జ్యోతిర్మయి డిగ్రీ వరకు తెనాలిలో చదువుకున్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 2008లో జ్యుడీషియల్ సర్వీసులో చేరారు. 2008లో నేరుగా జిల్లా జడ్జి కేడర్ కు ఎంపికయ్యారు. ఫ్యామిలీ, ఎస్సీ ఎస్టీ, సీబీఐ కోర్టు, వ్యాట్ ట్రైబ్యునల్ జడ్జిగా పనిచేశారు. విశాఖ, ప్రకాశం జిల్లాలకు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించారు. ప్రస్తుతం తూర్పుగోదావరి రాజమహేంద్ర వరంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు.
తాజాగా హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులైన వి.గోపాలకృష్ణరావు స్వగ్రామం ఉమ్మడి కృష్ణా జిల్లాలోని చల్లపల్లి. తల్లిదండ్రులు కోటేశ్వరమ్మ, సోమయ్య. అవనిగడ్డ బార్ అసోసియేషన్ పరిధిలో గోపాలకృష్ణారావు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 1994లో జూనియర్ సివిల్ జడ్జిగా గోపాలకృష్ణరావు ఎంపికయ్యారు. 2007లో సీనియర్ సివిల్ జడ్జిగా పదోన్నతి పొందారు. 2016లో అదనపు జిల్లా జడ్జిగా పదోన్నతి పొంది అదే హోదాలో శ్రీకాకుళం, తిరుపతిలో న్యాయసేవలు కొనసాగించారు. ప్రస్తుతం గుంటూరు 1వ అదనపు జిల్లా జడ్జిగా సేవలు అందిస్తున్నారు. కుమారుడు వి.రఘునాథ్ ఇటీవల జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం కర్నూలు జిల్లా ఆత్మకూరు కోర్టులో విధులు కొనసాగిస్తున్నారు. ఈ ఇద్దరితోనూ ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.