అప్పుడు తిట్టిండ్రు.. ఇప్పుడు దండాలు పెడుతుండ్రు.. సోషల్ మీడియాలో వైరల్
కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ భేటీ కావడం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. వీరిద్దరి భేటీలో సినిమాల గురించే మాట్లాడుకున్నారా? లేదంటే రాజకీయ పరమైన అంశాల గురించి చర్చ జరిగిందా? అనే విషయంలో స్పష్టత లేదు. అయితే వీరిద్దరి భేటీలో ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. అదేమిటంటే.. జూనియర్ ఎన్టీఆర్కు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ షేక్ హ్యాండ్ ఇవ్వడం.
ఆర్ఆర్ఆర్ సినిమాలో తారక్ నటన బాగుందని, కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించారని, అందుకే అమిత్ షా కలిశారని కమల దళం చెబుతోంది. 'ఆర్ఆర్ఆర్' సినిమా నుంచి కొమురం భీం ముస్లిం టోపీ పెట్టుకున్న స్టిల్ ను విడుదల చేసినప్పుడు బండి సంజయ్ మాట్లాడిన మాటలను ఆయన అభిమానులెవరూ మర్చిపోలేదు.
కొమురం భీంను కించపరిచేలా రాజమౌళి సినిమా తీశారని, తగిన గుణపాఠం చెబుతామని, నిజాం ఫొటోకు కాషాయం జెండా వేసి సినిమా తీసే ధైర్యం రాజమౌళికి ఉందా? అంటూ బండి సంజయ్ తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. 'ఆర్ఆర్ఆర్' విడుదల చేస్తే థియేటర్లు తగలబెడతామని హెచ్చరించారు.
''బిడ్డా... నువ్వు కొమురం భీంను, ఆదివాసీల హక్కులను కించపరిచే విధంగా సినిమా తీస్తున్నావు. వాళ్ళ మనోభావాలు గాయపడే సినిమా తీసి విడుదల చేస్తే బరిసెలతో తరిమికొడతాంసస అంటూ బండి హెచ్చరికలు జారీ చేశారు. అప్పట్లో ఆయన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. తాజాగా ఎన్టీఆర్ పక్కన ఫొటోల్లో కనిపించం కోసం బండి ప్రయత్నించడం చూసి కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.