ముద్రగడకు ప్రశ్న: చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఆలా ఎందుకు?
విజయవాడ: ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కాపులను బీసీల్లో చేర్చాలని ముద్రగడ పద్మనాభం చిరంజీవిపై ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదని ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ నాయకుడు జూపూడి ప్రభాకర్ రావు ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
కాపుల కోసం తెలుగుదేశం పార్టీ ఏం చేయడం లేదని ఆరోపించడం తగదని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో కాపుల ప్రస్తావనే తీసుకురాలేదన్నారు. కాంగ్రెస్లో కొనసాగుతున్న చిరంజీవి మేనిఫెస్టోలో కాపుల విషయం ప్రస్తావించకపోవడంపై అప్పుడు ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు.
ముద్రగడ సభలో కొన్ని రాజకీయ పార్టీలు కుట్ర పూరితంగా చొరబడ్డాయని ఆయన వెల్లడించారు. ఉద్దేశ పూర్వకంగానే విధ్వంసాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే ప్రభుత్వం చూస్తు ఊరుకోదన్నాదని జూపూడి హెచ్చరించారు.
తుని ఘటనలో దొరికిన సీసీ పుటేజీల ఆధారంగా ప్రభత్వం అందరిపై కేసులు నమోదు చేస్తుందని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, కేంద్ర ప్రభుత్వం కూడా కేసులు పెడుతుందని, రైలు తగులపెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని జూపూడి ప్రభాకర్ తెలిపారు.