నిరాహార దీక్ష చేస్తా: జూపూడి హెచ్చరిక, తగ్గిన ఎమ్మెల్సీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెంగల్రాయుడు, జూపూడి ప్రభాకర్ మధ్య శుక్రవారం కాసేపు వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెంగల్రాయుడుపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనమండలి సభ్యుడు జూపూడి ప్రభాకర్ సభా హక్కుల నోటీసు ఇచ్చారు.
తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని జూపూడి ఆరోపించారు. చెంగల్రాయుడు క్షమాపణ చెప్పకపోతే నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. స్పీకర్ పోడియం వద్ద బైఠాయించారు. దీంతో దిగొచ్చిన చంగల్రాయుడు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు.
చెంగల్రాయుడు క్షమాపణ చెప్పినందున దీక్షను విరమించుకుంటున్నాని జూపూడి చెప్పారు. చెంగల్రాయుడు వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించామని, సభ సజావుగా జరిగేందుకు ఇరువరూ సహకరించాలని మండలి చైర్మన్ చక్రపాణి సూచించారు. కాగా, జూపూడి మాట్లాడుతూ.. దళితుల గొంతును వినిపించడానికే తాను సభకు హాజరవుతున్నానని, నోరు మూసుకుని కూర్చోవడానికి కాదన్నారు.