బాబుపై ఫైర్: మత్తయ్యను కాపాడేందుకు డిజిపిని పంపుతారా?
హైదరాబాద్: నోటుకు ఓటు కేసు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తీరుపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు జ్యోతుల నెహ్రూ తీవ్రంగా ధ్వజమెత్తారు. కేసులో నాలుగో నిందితుడు మత్తయ్యను కాపాడేందుకు ఎపి డిజిపి జెవి రాముడిని గవర్నర్ నరసింహన్ వద్దకు పంపిస్తారా అంటూ ఆయన చంద్రబాబును ప్రశ్నించారు.
ఆ వ్యవహారాన్ని గమనిస్తే చంద్రబాబు ఎంతగా దిగజారిపోయారో అర్థమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. నోటుకు ఓటు కేసు నుంచి బయపడేందుకు దిక్కుమాలిన రాజకీయాలు చేయడానికి కూడా చంద్రబాబు వెనకాడడం లేదని అన్నారు. ఫెడరల్ వ్యవస్థలో ఉన్నట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని తప్పు పట్టారు.
నోటుకు ఓటు కేసుతో ప్రభుత్వానికి సంబంధం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇది తెలంగాణ ప్రభుత్వానికి, టిడిపికి సంబంధించిన అంశం మాత్రమేనని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవహారం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు తప్పు మీద తప్పు చేస్తున్నారని నెహ్రూ అన్నారు.
ప్రజలు వాస్తవాలు గ్రహించారని, అందుకే చంద్రబాబు మాటలు నమ్మడం లేదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఆదాయం పెంచుకునేందుకు రైతులపై భారం మోపాలని టిడిపి ప్రభుత్వం భావిస్తోందని, ఇందులో భాగంగా నీటి తీరువాను రెండింతలు చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు.