చంద్రబాబు వెంటనే రాజీనామా చేయాలి: నెహ్రూ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తక్షణమే రాజీనామా చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని ఆయన మండిపడ్డారు.
ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో ఏ ఒక్కదాన్నీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నెరవేర్చలేదని నెహ్రూ ఆరోపించారు. రైతుల రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు చెప్పిన ఆయన.. ఇప్పుడు రుణాలు కట్టేసేయండంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారని అన్నారు. రైతులు రుణాలు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారన్న విషయం చంద్రబాబుకు తెలియదా అని నెహ్రూ ప్రశ్నించారు.
విద్యుత్ శాఖపై చంద్రబాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు. వచ్చే మూడేళ్లలో పంపిణీ, సరఫరా నష్టాలను 12 నుంచి 6 శాతానికి తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ఇది ఇలా ఉండగా ఏపీలో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు మంగళవారం నుంచి మెరుపు సమ్మెకు దిగారు. సమ్మెలో 15వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొన్నారు. సమాన పనికి... సమాన వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించే వరకూ సమ్మె కొనసాగుతుందని ఉద్యోగులు స్పష్టం చేశారు.
అసెంబ్లీ సమావేశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
హైదరాబాద్: డిసెంబర్ 18 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అసెంబ్లీలో ఏయే బిల్లులు ప్రవేశపెట్టాలో తదితర అంశాలపై చర్చ జరిగింది. ఈ సమీక్షకు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.