జగన్పై ఆరోపణలు నిజమే, చంద్రబాబు ఎదుర్కొవాలి: జ్యోతుల నెహ్రూ
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు వచ్చిన వాస్తవమేనని ఆ పార్టీ నేత జ్యోతుల నెహ్రాూ అన్నారు. దీనికి సంబంధించిన కేసుపై కోర్టులో విచారణ జరుగుతోందని అన్నారు. తమ నేత తనపై వచ్చిన ఆరోపణలను ధైర్యంగా ఎదుర్కొంటున్నారని చెప్పారు.
జ్యోతుల నెహ్రూ ఓ మీడియా ఛానల్తో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్, మంత్రులపై అవినీతి, బినామీ పేర్లతో భూములు కొనుగోళ్లపై వచ్చిన ఆరోపణలను ఎదుర్కొవాలని అన్నారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి 2లక్షల కోట్లు సంపాదించుకున్నారని ఆరోపణలు చేస్తూ.. తెలుగుదేశం పార్టీ మంత్రులు 10లక్షల కోట్లు దోచుకుంటారా? అని మండిపడ్డారు. సాక్షిలో వచ్చిన కథనం ప్రకారం.. తెలుగుదేశం పార్టీ నేతలు సుమారు 5వేల ఎకరాల రాజధాని భూమిని బినామీ పేర్లతో కొనుగోలు చేశారని ఆరోపించారు.
తమపై వచ్చిన ఆరోపణలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులు, టీడీపీ నేతలు ఎదుర్కొవాలని డిమాండ్ చేశారు. బినామీ పేర్లను వేల కోట్ల భూములను కాజేస్తే ఊరుకోబోమని జ్యోతుల నెహ్రూ హెచ్చరించారు.