జగన్ తీరు భరించలేకపోయా, సిగ్గు శరం లేకుండా: ఊగిపోయిన జ్యోతుల
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ శాసన సభలో మంత్రి యనమల రామకృష్ణుడు శుక్రవారం తీర్మానం ప్రవేశ పెట్టారు. మంత్రి పత్తిపాటి పుల్లారావుపై చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ శాసన సభలో మంత్రి యనమల రామకృష్ణుడు శుక్రవారం తీర్మానం ప్రవేశ పెట్టారు. మంత్రి పత్తిపాటి పుల్లారావుపై చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దీనిని ప్రవేశ పెట్టారు.
అసమర్థ ప్రతిపక్ష నేత వల్ల సభా సమయం వృథా అవుతుందని చెప్పారు. నిరాధార ఆరోపణలు చేయడం ప్రతిపక్ష నేతకు అలవాటుగా మారిందన్నారు. పత్తిపాటిపై చేసిన ఆరోపణలపై విచారణ చేయాలని చెప్పి, ప్రతిపక్షం వెనక్కి పోతోందన్నారు.
విచారణ కమిటీ ముందు జగన్ ఆధారాలు చూపించవచ్చునని చెప్పారు. జగన్ నిరాధార ఆరోపణలు పదేపదే చేస్తున్నారన్నారు. మంత్రిపై చేసిన ఆరోపణలను ప్రతిపక్ష నేత రుజువు చేయలేదన్నారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు మాట్లాడారు. 2014లో వైసిపి నుంచి పోటీ చేసి గెలిచి, ఆ తర్వాత టిడిపిలో చేరిన జ్యోతుల నెహ్రూ.... జగన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్ తీరు భరించలేకపోయా
వైయస్ జగన్తో పని చేయడం మొదలు పెట్టిన తర్వాత.. ఆయన స్వభావాన్ని, ఆయన వ్యవహార తీరును భరించలేక నేను తప్పటడుకు వేశాననని భావించానని చెప్పారు. ఆ తర్వాత తప్పును సరిదిద్దుకునేందుకు ఆలోచన చేశానన్నారు. అందుకోసం మదనపడ్డానని తెలిపారు.
జగన్ వ్యవహార శైలి, తీరు భరించలేకపోయానని చెప్పారు. తన ఇమేజ్ పెంచుకునేందుకు ఓ వ్యక్తిని విమర్శించేందుకు ప్రతిపక్ష నేత ఎంత నీచానికైనా దిగజారుతారనేందుకు మంత్రి పత్తిపాటి పుల్లారావుపై చేసిన ఆరోపణలే నిదర్శనం అన్నారు.

సిగ్గు, శరం లేకుండా
నాపై మీరు చేసిన ఆరోపణలకు వాస్తవాలు వెలికితీయాలంటే సభా కమిటీ వేయాలని పత్తిపాటి సవాల్ చేశారని, అప్పుడు జగన్ వద్దన్నారన్నారు. సభ పైన ఆయనకు నమ్మకం లేకుండా పోయిందన్నారు. ఆ తర్వాత జగన్ జ్యూడిషియల్ విచారణకు అడిగారన్నారు. ఆ సవాల్కు పత్తిపాటి సిద్ధపడితే.. జగన్ మాత్రం సిగ్గు, శరం లేకుండా తప్పించుకున్నారని ఎద్దేవా చేశారు.

ఆదినారాయణ చెప్పారు.. మేం చెప్పలేకపోతున్నాం
సోదరుడు ఆదినారాయణ రెడ్డి వారి గురించి చెప్పారని, మేం చెప్పలేకపోతున్నామని జ్యోతుల అన్నారు. ఇలాంటి ప్రతిపక్ష నేత ఉన్నందుకు సిగ్గుపడుతున్నామన్నారు. ప్రజానీకం నివ్వెరపోయాలా జగన్ వ్యవహరిస్తున్నారన్నారు.
ప్రతిపక్ష హోదా వచ్చినప్పటికీ ఆయన తీరులో మార్పు లేదన్నారు. వైసిపి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి జగన్ తీరును చూస్తున్నానని చెప్పారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేతగా వ్యవహరించడం లేదన్నారు. జగన్కు ప్రతిపక్ష నేతగా కూడా అర్హత లేదన్నారు.

చర్యలు తీసుకోవాలి
సభలో ప్రజా సమస్యలపై చర్చించుకోవాలే తప్ప, అసత్య ఆరోపణలు చేయడం సరికాదని బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు అన్నారు. సభను అగౌరవపరిచిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అసత్య ఆరోపణలు చేస్తూ సభా సమయాన్ని వృథా చేశారన్నారు. శాసన సభ నియమాలు అందరూ పాటించాలన్నారు. సభ హుందాతనాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.












Click it and Unblock the Notifications