జగన్.. ఇంకా అలాగే!, ఆ తీరు నచ్చకే.. నేను, భూమా బయటకొచ్చేశాం: జ్యోతుల
జగన్ తీరు ఏమాత్రం నచ్చకనే తాము పార్టీ నుంచి బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చిందని జ్యోతుల నెహ్రూ చెప్పుకొచ్చారు.
అమరావతి: రాష్ట్రంలో ఒక శాసనసభ్యుడు చనిపోతే.. సభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన వేళ ప్రతిపక్ష పార్టీ దానికి దూరంగా ఉండటం దురదృష్టకరమని ఏపీ అధికార పార్టీ వ్యాఖ్యానించింది. భూమా నాగిరెడ్డి మృతికి సంతాపంగా మంగళవారం సభలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
సంతాప తీర్మానం నేపథ్యంలో.. పలువురు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డితో తమ అనుబంధం, ఆయన రాజకీయ తీరుతెన్నుల గురించి మాట్లాడారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రతిపక్షం వైసీపీని టార్గెట్ చేస్తూనే.. భూమా, తాను ఆ పార్టీని ఎందుకు వీడాల్సి వచ్చిందో వివరించారు.
ఓ శాసనసభ్యుడికి సంతాపం తెలియజేస్తున్న వేళ, ఆయన గురించి మాట్లాడుతున్న సమయంలో, సందర్భం కాకపోయినా తాము వైసీపీని ఎందుకు వీడాల్సి వచ్చిందో తెలియజేయాల్సిన సమయం వచ్చిందని జ్యోతుల నెహ్రూ అభిప్రాయపడ్డారు.
సంతాప తీర్మానానికి వైసీపీ దూరంగా ఉండటాన్ని తప్పుపడుతూ.. భూమా నాగిరెడ్డి, తాను జగన్ తో విభేదించి ఆ పార్టీ నుంచి బయటకు రావడానికి ఈ వైఖరే కారణమన్నారు. జగన్ ఏకపక్ష నిర్ణయాలు, ఎకనాయకత్వం.. నియంతృత్వ పోకడల వల్లే పార్టీకి దూరమైనట్లు చెప్పారు. అదే వైఖరి జగన్ ఇంకా కొనసాగిస్తున్నారని, అందుకే ఈరోజు సభకు కూడా హాజరుకాలేదని అన్నారు.
జగన్ తీరు ఏమాత్రం నచ్చకనే తాము పార్టీ నుంచి బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చిందని జ్యోతుల నెహ్రూ చెప్పుకొచ్చారు. చివరగా, భూమా ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.