బాబూ! ఎందుకంత భయం: భూమా అరెస్టుపై నెహ్రూ
హైదరాబాద్: తమ పార్టీ నంద్యాల శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డిపై హత్యాప్రయత్నం కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేయడంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు జ్యోతుల నెహ్రూ తీవ్రంగా ధ్వజమెత్తారు. చంద్రబాబుకు తమ పార్టీని చూస్తే ఎందుకంత భయమో అర్థం కావడం లేదని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన రాక్షస పాలనను గుర్తు చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. తమ పార్టీ పార్టీ శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డిపై హత్యాప్రయత్నం కింద కేసు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు ని ఆయన అన్నారు. ప్రతిపక్ష పార్టీని నిర్వీర్యం చేయాలనే ప్రయత్నంలో భాగంగానే భూమా నాగిరెడ్డిపై కేసు పెట్టారని ఆయన దుయ్యబట్టారు.

చంద్రబాబు తప్పులను వేలెత్తి చూపిన తమ పార్టీవారిపై అక్రమ కేసులు బనాయిస్తారా అని అడిగారు. ఇది రాక్షస పాలన కాకుండా మరేమవుతుందని ఆయన అడిగారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యాన్ని సృష్టించాలని చంద్రబాబు చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఉత్సాహంగా పనిచేస్తున్న తమ పార్టీ శాసనసభ్యులను అరెస్టు చేసి అణగదొక్కాలని చూస్తున్నారని ఆయన చంద్రబాబుపై మండిపడ్డారు.
ఒక విద్యార్థి మృతికి విజయవాడ సెంట్రల్ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వర రావు కుమారుడు సిద్ధార్థ కారకుడంటూ మీడియాలో వార్తలు వచ్చిన తర్వాతనే అతడిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయాన్ని జ్యోతుల నెహ్రూ గుర్తు చేశారు. ఇది వాస్తవం కాదా అని ఆయన అడిగారు. కాగా, భూమా నాగిరెడ్డిని కాసేపట్లో కోర్టులో ప్రవేశపెడుతామని కర్నూలు జిల్లా ఎస్పీ చెప్పారు. టిడిపి కార్యకర్తలపై కూడా కేసులు నమోదు చేశామని, తాము ఏకపక్షంగా వ్యవహరించామని అనడంలో వాస్తవం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications