ప్రభుత్వంతో టచ్లో ఉన్నా: జ్యోతుల, జలీల్ చేరిక.. బాబుపై బిజెపి గుర్రు
విజయవాడ: తాను తెలుగుదేశం పార్టీతో టచ్లో లేనని, ప్రభుత్వంతో టచ్లో ఉన్నానని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సోమవారం చెప్పారు. జ్యోతుల కూడా సైకిల్ ఎక్కుతారనే ఊహాగానాలు వినిపించాయి. దీనిపై ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు.
తాను టిడిపితో టచ్లో లేనని, ప్రభుత్వంతో టచ్లో ఉన్నానని చెప్పారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల చేరిక విషయమై అధికార పార్టీ మైండ్ గేమ్ ఆడుతోందన్నారు. పార్టీ ఫిరాయించిన వారి పైన అనర్హత వేటు వేయాలన్నారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు.
భూమా నాగిరెడ్డి తదితురులు పార్టీ మారడంపై ఆయన స్పందిస్తూ.. నైతిక విలువలు, నాయకత్వంపై నమ్మకం ఉండాలన్నారు. భూమా ఎందుకు పార్టీ మారారో తమకే అర్థం కావడం లేదన్నారు. పార్టీ మారిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యేలను కట్టడి చేసేందుకు వారేమీ జంతువులు కాదన్నారు.
జలీల్ ఖాన్ను ఎలా చేర్చుకుంటారు?: బిజెపి
తమను సంప్రదించకుండానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ను టిడిపిలో ఎలా చేర్చుకుంటారని బిజెపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొత్తులో భాగంగా తమకు కేటాయించిన నియోజకవర్గంలో టిడిపి ఫిరాయింపు రాజకీయాలు చేయడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.
జలీల్ ఖాన్ను పార్టీలో ఎలా చేర్చుకున్నారో చెప్పాలని చంద్రబాబును బిజెపి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇంఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. చిత్తశుద్ధి ఉంటే జలీల్ ఖాన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గెలవాలన్నారు. జలీల్కు ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు.