అందుకే పీఆర్పీలో చేరా, బాబు పాలన అద్భుతంగా ఏంలేదు, తిడుతా: నెహ్రూ
రాజమహేంద్రవరం: ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, మాజీ కేంద్రమంత్రి చిరంజీవి ముఖ్యమంత్రి అవుతారనే ఉద్దేశ్యంతోనే తాను ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లానని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చెప్పారు. ఆయన ఓ టీవీ ఛానల్తో మాట్లాడారు.
2014 సార్వత్రిక ఎన్నికల్లో జ్యోతుల నెహ్రూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇటీవలే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సన్నద్ధమయ్యారు. ఈ నెల 8వ తేదీన ఆయన సైకిల్ ఎక్కనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
చిరంజీవి సీఎం అవుతారనే ఉద్దేశ్యంతోనే తాను పీఆర్పీలోకి వెళ్లానని, అందులో తప్పు పట్టాల్సిందేం లేదన్నారు. అదే సమయంలో ఆయన చంద్రబాబు పాలన పైన కూడా కామెంట్ చేశారు. బాబు పాలన అద్భుతంగా ఉందని తాను ఏమీ చెప్పడం లేదన్నారు.
నిన్నటి వరకు చంద్రబాబును ప్రశ్నించారు కదా అంటే.. నేను పార్టీలో చేరాక తప్పు చేసినా ప్రశ్నిస్తానని చెప్పారు. వైసిపిలో నేను నెంబర్ టూ కాదని చెప్పారు. ఆ పార్టీలో నెంబర్ వన్ మాత్రమేనని, నెంబర్ టూ, త్రీ ఉండరని జగన్ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు.
ఎదుటి పార్టీ వారు ఏ స్థాయిలో విమర్శలు చేసినా తట్టుకునే సామర్థ్యం జగన్కు ఉందన్నారు. కానీ సొంత పార్టీ వారు ప్రశ్నిస్తే మాత్రం తట్టుకోలేరన్నారు. అలాగే వైసిపిలో ఉంటూ టిడిపిపై చేసిన విమర్శలను తన సొంత అభిప్రాయంగా భావించవద్దన్నారు. చంద్రబాబు తప్పు చేసినా తాను ఇప్పుడు కూడా తిడతానని చెప్పారు. గతంలో ప్రశ్నించే తత్వం వల్లే టిడిపిని వీడానని, ఇప్పుడు చంద్రబాబు తనకు హామీ ఇచ్చారన్నారు.