KA PAUL : కేఏ పాల్ యాత్ర ప్రారంభం-కాకినాడలో అడుగడుగునా కామెడీ-జనసేన షాకులు ?
ఏపీ రాజకీయాల్లో ఉనికి చాటుకోవడంలో విఫలమవుతున్న కేఏ పాల్ మరోసారి తన అదృష్టం పరీక్షించుకునేందుకు మాత్రం ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ కాకినాడ నుంచి పాల్ తన ఏపీ పర్యటన ప్రారంభించారు. అక్కడి నుంచి రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు. అయితే తొలిరోజే ఆయనకు కాకినాడలో భారీ షాకులు తగిలాయి. అయితే ఇవేవీ పట్టించుకోకుండా ఆయన తన పని తాను చేసుకుపోతున్నారు.
ఏపీలో కేఏ పాల్ యాత్ర
ప్రముఖ ఎవాంజలిస్ట్, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఏపీ రాజకీయాల్లో మరోసారి తన ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా విస్త్రృతంగా పర్యటించాలని నిర్ణయించుకున్నారు. ఈ మధ్యనే కేంద్రంలో బీజేపీ పెద్దల్ని కలిసి వచ్చిన పాల్.. ఇప్పుడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించడం ద్వారా ప్రజాశాంతి పార్టీకి జీవం పోయాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగా కాకినాడ నుంచి తన యాత్ర ప్రారంభించారు. అయితే కాకినాడలో యాత్ర ప్రారంభానికి ముందే ఆయనకు షాకులు తగిలాయి.
పాల్ కార్లు మాయం
రాష్ట్రవ్యాప్తంగా తన యాత్ర కోసం కేఏ పాల్ మొత్తం ఐదు కార్లు రెడీ చేసుకున్నారు. వీటిలో తన అనుచరులతో పాటు బౌన్సర్లు కూడా ప్రయాణించేలా ప్లాన్ చేసుకున్నారు. ఇందుకోసం నిన్న రాత్రే అనుచరులతో పాటు కాకినాడ చేరుకున్న పాల్.. ఇవాళ కాకినాడలో బయలుదేరి ఏలూరు వెళ్లాలని నిర్ణయించారు. అయితే రాత్రికి రాత్రే ఆయనకు షాకులు తగిలాయి. కాకినాడలోని సీబీఎం స్కూల్లో ఆయన కార్లు పార్క్ చేశారు. కానీ పార్క్ చేసిన ఐదు కార్లలో ఉదయానికి కేవలం మూడు కార్లే కనిపించాయి. మరో రెండుకార్లు కనిపించలేదు. అంతే కాదు మిగతా కార్లు కూడా ఆ స్కూల్ క్యాంపస్ నుంచి బయటికి వెళ్లకుండా యాజమాన్యం తాళాలు వేసింది. దీంతో పాల్ కూ, ఆయన అనుచరులకు చిర్రెత్తుకొచ్చింది.
కార్లు ఎత్తుకెళ్లింది జనసేన నేతలే ?
స్కూల్లో రాత్రి తాము పార్క్ చేసిన ఐదు కార్లలో రెండు కార్లు కనిపించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేఏ పాల్ స్ధానిక పోలీసులకు ఫిర్యాదు చేసారు. అయితే కేఏ పాల్ పార్క్ చేసిన ఐదు కార్లలో రెండింటిని ఎత్తుకెళ్లింది జనసేన కార్యకర్తలే అని ఆ తర్వాత తేలింది. తొలుత తన కార్లను మాయం చేసి మిగతా కార్లను కూడా స్కూల్లో నుంచి బయటకు వెళ్లకుండా తాళాలు వేసిన స్కూల్ యజమాని రత్నాకర్ తనకు పాల్ 25 లక్షలు బాకీ ఉన్నట్లు చెప్పారు. పోలీసులు ఆయన్ను ప్రశ్నించినా ఇదే చెప్పారు. తనకు ఇవ్వాల్సిన డబ్బులిచ్చి కార్లు తీసుకెళ్లమన్నారు. అయితే ఇదంతా ఒట్టిదేనని పోలీసులు తేల్చారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పై పాల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జనసేన నేతలే ఆయన కార్లు తీసుకెళ్లినట్లు తెలిసింది. దీంతో వారితో మాట్లాడి పోలీసులు కార్లను పాల్ కు ఇప్పించారు.
కాకినాడలో పాల్ హంగామా..
అనంతరం కార్లలో బయలుదేరిన కేఏ పాల్ నగరంలోని మెయిన్ రోడ్డుతో పాటు ఇతర ప్రాంతాల మీదుగా వెళ్తున్న సమయంలో రోడ్ల పక్కన ఆగారు. అక్కడే టీ స్టాల్ లో టీ తాగుతూ ఫొటోలు, వీడియోలకు ఫోజులిచ్చారు. అంతే కాదు ప్రపంచంలోనే ఇంతకంటే గొప్ప టీ ఎవరూ తయారు చేయలేరన్నారు. అంతలోనే తన అనుచరులకు మీరు కూడా ఫొటోలు, వీడియోలు తీయాలని పాల్ సూచించారు. తనను ఎవరూ ఏమీ చేయలేరంటూ వ్యాఖ్యలు చేశారు. స్ధానికులతో కలిసి కాసేపు నవ్వులు పూయించారు. చివరికి కాకినాడ నుంచి బయలుదేరి ఏలూరు వెళ్లిపోయారు. దీంతో ఆయనతో మాట్లాడిన స్ధానికులు సంతోషం వ్యక్తం చేశారు.