KA Paul: నా వల్లే మేలో ఏపీ ఎన్నికలు-అందుకే నేను ఎనిమిదో వింతన్న కేఏ పాల్..
ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికలను మే నెలలో నిర్వహించాలంటూ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ .. ఇవాళ సీఈసీ తీసుకున్న నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్ధులకు పరీక్షలు జరిగే ఏప్రిల్ నెలలో కాకుండా మేలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ హైకోర్టులో తాను పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తన వల్లే మేనెలలో ఎన్నికలకు ఈసీ నిర్ణయం తీసుకుందన్నారు.
చూశారా మన తెలుగుసత్తా అంటూ కేఏ పాల్ ఓ వీడియో విడుదల చేశారు. మార్చి 12న ఏపీ హైకోర్టు తన పిటిషన్ పై స్పందిస్తూ మే నెలలోనే ఎన్నికలు పెట్టాలంటూ ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ తీర్పు ఇచ్చిందని పాల్ తెలిపారు. అలాగే కౌంటింగ్ కూడా వెంటనే చేపట్టాలన్న తన డిమాండ్ ను కూడా ఈసీ అంగీకరించిందన్నారు. ఇది ఎవరూ సాధించలేదని సీనియర్ లాయర్లు, జడ్డీలు కూడా చెప్తున్నారని కేఏ పాల్ తెలిపారు. అందుకే తాను ప్రపంచంలో ఎనిమిదో వింత అంటారన్నారు.

తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపైనా హైకోర్టు సానుకూల తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు. 8 లక్షల కోట్ల స్టీల్ ప్లాంట్ ను 8 వేల కోట్లకు ఎలా అమ్ముతారని హైకోర్టు ప్రశ్నించిందన్నారు. దీంతో ప్రైవేటీకరణ ఆగిపోయిందన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రజాశాంతి పార్టీలో ఇతర పార్టీల నేతలంతా చేరాలని కోరారు. విశాఖ ఎంపీగా కూడా తనను గెలిపించాలని ఓటర్లను పాల్ కోరారు. ఎన్నికలకు 57 రోజులే టైం ఉందని, కాబట్టి అందరూ మంచి నిర్ణయం తీసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications